
సౌథాంప్టన్: సరికొత్తగా నేర్చుకోవడం ఆపేసినప్పుడు ఆట నుంచి తప్పుకుంటానని టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. పోటీతత్వమే తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటకు తీసుకొస్తోందన్నాడు. ఏదో ఒకటి సరికొత్తగా నేర్చుకోవాలన్న తపనే తన కెరీర్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని యాష్ వెల్లడించాడు. సౌథాంప్టన్ వేదికగా ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో అశ్విన్ ఆడుతున్నాడు.
నేర్చుకోవడం ఆపేస్తే వీడ్కోలు పలుకుతా:
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఐసీసీకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ... 'కెరీర్ సాగుతున్న కొద్దీ పరిపూర్ణత కోసం ప్రయత్నించడమే టెస్టు క్రికెట్లోని అసలైన అందం. నిత్యం నేర్చుకొనేందుకు ప్రేరణ కల్పిస్తుంది. ఆ తత్వమే నా కెరీర్లో ఇన్ని విజయాలు సాధించేందుకు ఉపయోగపడింది. నేను ఏదో ఒక పాయింట్ వద్ద ఆగిపోలేదు. నిరంతరం మెరుగు పరుచుకొనేందుకే ప్రయత్నించా. భిన్నంగా ప్రయత్నించడం ఇష్టం లేనప్పుడు, సరికొత్తగా నేర్చుకొనే సహనం లేనప్పుడు ఆడటం మానేస్తా' అని అశ్విన్ తెలిపాడు.
వివాదాలు నాకేమీ ఇష్టం కాదు:
సాధారణంగా రవిచంద్రన్ అశ్విన్ ఎప్ప్పుడైనా స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తం చేస్తుంటాడు. క్రికెట్, సమాజ సేవ లాంటి విషయాలపై చురుగ్గా ఉంటాడు. కరోనా కఠిన పరిస్థితిలో కూడా ప్రజలకు అండగా నిలిచాడు. అయితే యాష్ మరీ విమర్శలకు పోకున్నా బలంగా తన అభిప్రాయం మాత్రం చెప్తాడు. 'వివాదాలు నాకేమీ ఇష్టం కాదు. పోరాటాన్ని నేనిష్టపడతా. నిజానికి ఆ తత్వం వల్లే నేనిక్కడున్నా. విజయాలకు ఏమాత్రం పొంగిపోను. ఎందుకంటే విజయమనేది ఒక సంఘటన. సాధన, ప్రణాళికతో అది సాధ్యమవుతుంది. ప్రతిసారీ ఇంకా మెరుగ్గా ఏం చేయాలనే ఆలోచిస్తా' అని అశ్విన్ చెప్పాడు.
నాకు బాగానే చెల్లిస్తున్నారు:
'నిజాయతీగా చెప్పాలంటే నా ప్రదర్శనలపై వచ్చే కథనాలను నేను పెద్దగా పట్టించుకోను. నేను నాలాగే ఉంటాను. భారత్లో అతిగా పొగిడేస్తారు. కానీ నేనో సాధారణ వ్యక్తిని. క్రికెట్ ఆడుతూ మనశ్శాంతి, ఆనందం పొందుతాను. ఆట ఆడుతూ నా కుటుంబాన్ని పోషించుకోవడమే నాకు ఆనందం. నాకు బాగానే చెల్లిస్తున్నారు. క్రికెట్ ఆడటం వల్లే నా జీవితానికి ఒక అర్థం వస్తోంది. అందుకే నేను ఆసక్తిగా, ఆనందంగా ఉంటాను. ఎవరు పొగిడినా, తిట్టినా పట్టించుకోను. నా జీవితం నాది' అని టీమిండియా స్పిన్నర్ ఆర్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.