WTC Final Reserve Day: భద్రతే ముందు.. ఆరో రోజు ప్రణాళికలేంటో చెప్పిన మొహ్మద్ షమీ!!

సౌథాంప్టన్: ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రసవత్తర దశకు చేరుకున్నది. బుధవారం ఆరో రోజు ఆట (రిజర్వ్ డే) జరగనుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఆరో రోజుకు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. రెండు రోజులు పూర్తిగా వర్షం వల్ల ఆటను కోల్పోవడంతో రిజర్వ్ డేలో అత్యధికంగా 98 ఓవర్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రెండవ ఇన్నింగ్స్లో 32 రన్స్తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కివీస్ కూడా గెలిచే ఛాన్సు ఉంది. దీంతో ఆఖరి రోజు ఇరు జట్లు పక్కా హ్యూహాలతో బరిలోకి దిగనున్నాయి. అయితే 'భద్రతే ముందు' అన్న విధానాన్ని భారత్ అనుసరిస్తుందని సీనియర్ పేసర్ మొహ్మద్ షమీ తెలిపాడు.

చాలినన్ని పరుగులు చేయాలి:
ఐదో రోజు ఆట ముగిశాక మొహ్మద్ షమీ మీడియాతో మాట్లాడుతూ బుధవారం టీమిండియా అమలుచేయనున్న ప్రణాళికల గురించి చెప్పాడు. 'వర్షం వల్ల మేం చాలా సమయం కోల్పోయాం. అందుకే స్కోర్ల గురించి ఆలోచించడం లేదు. భారత్ ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. మొదట మేం పరుగులు చేయాలి. వీలైనన్ని పరుగులు చేశాక.. సమయాన్ని బట్టి నిర్ణయం (డిక్లేర్) తీసుకుంటాం. ఇంగ్లండ్ వంటి పరిస్థితుల్లో ఏదైనా జరగొచ్చు. ఇన్ని ఓవర్లలో వారిని ఔట్ చేయాలంటూ మాకేమీ ముందస్తు ప్రణాళికలు లేవు. త్వరగా 10 వికెట్లు తీయాలంటే.. పక్కా ప్రణాళికలు అవసరం. అంతకన్నా ముందు మేం చాలినన్ని పరుగులు చేయాలి' అని షమీ అన్నాడు.

ఒకే ప్రణాళికతో ఉండకూడదు:
ఐదో రోజు తన ప్రణాళికలు బాగా అమలైనందుకు మొహ్మద్ షమీ ఆనందం వ్యక్తం చేశాడు. 'టెస్టు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఐదు రోజులూ ఒకే ప్రణాళికతో ఉండకూడదు. పిచ్ను బట్టి వాటిని ఎప్పుడూ మారుస్తుండాలి. న్యూజిలాండ్ను తక్కువ పరుగులకే పరిమితం చేయాలంటే.. మేం కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బంతులు విసరాలి. ఒత్తిడిని సృష్టిస్తే మూమెంటమ్ వస్తుంది. దాంతో వికెట్లు లభిస్తాయి' అని షమీ తెలిపాడు. బంతితో విజృంభించిన షమీ.. రాస్ టేలర్ (11), వాల్టింగ్ (1), కొలిన్ గ్రాండ్హోమ్ (13), కైల్ జెమీసన్ (21)లను ఔట్ చేశాడు.

వ్యక్తిగత మైలురాళ్ల గురించి పట్టించుకోను:
ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎప్పుడైనా తనకిచ్చిన బాధ్యతను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తానని మొహ్మద్ షమీ పేర్కొన్నాడు. కెప్టెన్ ఏం కోరుకుంటాడో తనకు తెలుసని, అతడి ఆదేశాలు అనుసరిస్తానని వెల్లడించాడు. తానెప్పుడూ దూకుడుగా బంతులేసి వికెట్లు తీసే బౌలరేనని చెప్పాడు. ఐదు వికెట్లు తీయనందుకు తనకేమీ బాధలేదన్నాడు. టీమిండియాకు ఆడుతున్నప్పుడు అలాంటివేమీ ఉండవని, వ్యక్తిగత మైలురాళ్ల గురించి పట్టించుకోకూడదన్నాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్లో 26 ఓవర్లు వేసిన షమీ 76 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కివీస్ రెండో ఇన్నింగ్స్లో కూడా షమీ కీలకం కానున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications