సౌథాంప్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ పేసర్ల దెబ్బకి భారత బ్యాట్స్మన్ పెవిలియన్కు క్యూ కట్టారు. ముఖ్యంగా ఆరడుగుల పేసర్ కైల్ జేమీసన్ ఐదు వికెట్లు తీసి.. టీమిండియాను దెబ్బకొట్టాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానే (49), కెప్టెన్ విరాట్ కోహ్లీ (44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మొహ్మద్ షమీ (4) నాటౌట్గా నిలిచాడు. 146/3 ఓవర్నైట్ స్కోర్తో ఆదివారం మూడో రోజు ఆట కొనసాగించిన భారత్.. మరో 71 పరుగులు చేసి మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. కివీస్ పేసర్లలో జేమీసన్ 5/31, నీల్ వాగ్నర్ 2/40, ట్రెంట్ బౌల్ట్ 2/47 ప్రదర్శనతో మెరిశారు. కివీస్ ఒక్క స్పిన్నర్ను కూడా ఆడించని విషయం తెలిసిందే.
146/3 ఓవర్ నైట్ స్కోర్తో బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ ఆరంభించగా.. అర్ధ శతకాలు పూర్తి చేసుకోకముందే వెనుదిరిగారు. ఓవర్ నైట్ స్కోర్కు భారత్ మూడు పరుగులు మాత్రమే జోడించి కోహ్లీ వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ ముంగిట కోహ్లీ (132 బంతుల్లో 44) ఎల్బీగా వెనుదిరిగాడు. ఓవర్నైట్ స్కోర్కు ఒక్క పరుగు కూడా చేయకుండానే జెమీసన్ అద్భుత బంతికి పెవిలియన్ చేరాడు. రివ్యూ తీసుకున్నా.. ఫలితం లేకపోయింది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారంతో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో పూర్తిగా డిఫెన్స్కు పరిమితమైన కోహ్లీ.. చివరకు ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ కూడా విరాట్ కోహ్లీ లానే డిఫెన్స్ చేశాడు. తన శైలికి పూర్తి బిన్నంగా ఆడాడు. మరోవైపు అజింక్య రహానె మాత్రం సింగిల్స్ తీస్తూ.. కాస్త భారత స్కోరును కదిలించాడు. పంత్ ఓ ఫోర్ బాది గాడిలో పడ్డాడనుకున్నా.. అంతలోనే ఔట్ అయ్యాడు. జేమీసన్ వేసిన 74 ఓవర్ నాలుగో బంతికి పంత్ (4) లాథమ్ చేతికి చిక్కాడు. ఆపై రహానే (49; 117 బంతుల్లో) కూడా పెవిలియన్ బాట పట్టాడు. వాగ్నర్ వేసిన 79వ ఓవర్ నాలుగో బంతికి రహానే హాఫ్ సెంచరీ ముందు క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ నేపథ్యంలోనే జోడీ కట్టిన రవిచంద్రన్ అశ్విన్ (22), రవీంద్ర జడేజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అశ్విన్ కొన్ని చూడముచ్చటైన షాట్లు ఆడాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో సౌథీ బౌలింగ్లో అశ్విన్ పెవిలియన్ చేరాడు. అనంతరం జడేజా, ఇషాంత్ శర్మ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను ముగించారు. రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే ఇషాంత్ (4), జస్ప్రీత్ బుమ్రా(0), జడేజా (15) ఔటవ్వడంతో భారత్ తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. కివీస్ పేసర్లలో జేమీసన్ 5/31, నీల్ వాగ్నర్ 2/40, ట్రెంట్ బౌల్ట్ 2/47 ప్రదర్శనతో మెరిశారు.