
సౌథాంప్టన్: భారత్తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమీసన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. డబ్ల్యూటీసీ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా జెమీసన్ ఐదు కీలక వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ మరియు జస్ప్రీత్ బుమ్రాల వికెట్లు పడగొట్టాడు. దీంతో జెమీసన్ 8 టెస్టుల్లో 44 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఇన్ని వికెట్లు తీసుకున్న తొలి న్యూజిలాండ్ బౌలర్గా రికార్డులోకి ఎక్కాడు. ఈ క్రమంలో 80 ఏళ్ల నాటి రికార్డును అతడు బద్దలుగొట్టాడు.
80 ఏళ్ల రికార్డు బ్రేక్:
1930, 1940లలో న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జాక్ కౌవీ 8 టెస్టుల్లో 41 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడా రికార్డును కైల్ జెమీసన్ (8 టెస్టుల్లో 44) తిరగరాశాడు. 8 టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన న్యూజిలాండ్ ఆటగాళ్లలో.. జెమీసన్, జాక్ కౌల్ తర్వాత షేన్ బాండ్ ఉన్నాడు. 2001-2003 మధ్య షేన్ బాండ్ 38 వికెట్లు పడగొట్టాడు. ఇక 2011-2012లో డగ్ బ్రాస్వెల్ 33 వికెట్లు తీసుకోగా.. 1969లో హెడ్లీ హోవర్త్ 32 వికెట్లు తీసుకున్నాడు. జాక్ కౌవీ రెండుసార్లు 40కి పైగా వికెట్లు పడగొట్టడం విశేషం.
వికెట్ కోల్పోకుండా 69 పరుగులు:
భారత్తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. మూడో రోజైన ఆదివారం మూడో సెషన్లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 33 ఓవర్లు ఆడి.. వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (29; 99 బంతుల్లో 3x4), డెవాన్ కాన్వే (38; 99 బంతుల్లో 5x4)లు క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ నిలకడగా ఆడుతూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఈ జోడీని విడదీసేందుకు టీమిండియా బౌలర్లు అష్టకష్టాలు పడుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే కివీస్ ఇంకా 148 పరుగులు వెనకబడి ఉంది.
217 పరుగులకు భారత్ ఆలౌట్:
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకు ఆలౌటైంది. వైస్ కెప్టెన్ అజింక్య రహానే (49; 117 బంతుల్లో 5x4), కెప్టెన్ విరాట్ కోహ్లీ (44; 132 బంతుల్లో 1x4) టాప్ స్కోరర్లుగా నిలిచారు. వర్షం కారణంగా ఆదివారం మూడో రోజు ఆట అరగంట ఆలస్యంగా ప్రారంభమవ్వగా.. భారత్ 146/3 ఓవర్నైట్ స్కోర్తో బరిలోకి దిగింది. మరో 71 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. కివీస్ పేసర్ కైల్ జేమీసన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. జేమీసన్తో పాటు వాగ్నర్, బౌల్ట్ సైతం భారత బ్యాట్స్మెన్ను కుదురుకోనివ్వలేదు. దాంతో కోహ్లీసేన 217 పరుగులకే ఆలౌట్ అయింది. జేమీసన్ 5/31, నీల్ వాగ్నర్ 2/40, బౌల్ట్ 2/47 మెరుగైన ప్రదర్శన చేశారు.