
సౌథాంప్టన్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ తొలి రోజు ఆట రద్దయింది. శుక్రవారం వర్షం కాసేపు కురుస్తూ, మరి కాసేపు ఎడతెరిపినిస్తూ దోబూచులాడింది. ఈ క్రమంలో తొలి రోజులోని మూడు సెషన్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఫీల్డ్ అంపైర్లు, రిఫరీ గంట గంటకు మైదానాన్ని పరిశీలించి.. సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. రెండో రోజైన శనివారం వరణుడి కరుణిస్తే.. 98 ఓవర్ల ఆట సాగనుంది. రెండో రోజు ఆట 3 గంటలకు ప్రారంభం కానుంది.
శుక్రవారం ఉదయం నుంచి సౌథాంప్టన్లో ఏకధాటిగా వర్షం కురవడంతో.. తొలి రోజు ఆట సగం రోజు వరకు సాగలేదు. మొదటగా తొలి సెషన్ వరకు వేచి చూడగా.. భోజన విరామం అనంతరం సైతం తేలికపాటి జల్లులు కురిశాయి. ఈ క్రమంలోనే వరుణుడు కాస్త కనికరించినా.. మైదానమంతా వర్షం నీరుతో నిండిపోయింది. సిబ్బంది నీటిని బయటకు పంపించినా.. మైదానం చిత్తడిగా మారింది. దీంతో 7.30 మైదానాన్ని మరోసారి పరిశీలించిన అంపైర్లు.. తొలిరోజు ఆట సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీంతో క్రీడాలోకం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టాస్ కూడా పడలేదు.
వర్షం కారణంగా దురదృష్టవశాత్తు తొలి రోజు మ్యాచ్ రద్దు అయిందని, రేపు మామూలుగానే నిర్ణీత సమయానికి మ్యాచ్ ప్రారంభం అవుతుందని బీసీసీఐ ట్వీట్ చేసింది. శనివారం నుంచి మ్యాచ్ సజావుగా సాగితే.. తొలి రోజు కోల్పోయిన సమయాన్ని రిజర్వ్డే రోజు నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ శనివారం, ఆదివారం కూడా వరుణుడు ఇలానే ప్రభావం చూపితే.. మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే తొలి ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న కేన్ విలియంసన్, విరాట్ కోహ్లీల కల తీరకుండానే పోనుంది.
WTC Final 2021: అబ్బా వర్షం! 2019లో కేదార్ జాదవ్ చెప్పినట్లుగా.. ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చుగా?