వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తు రేసు రసవత్తరంగా సాగుతోంది. ఓ జట్టు విజయం ఇతర జట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్లు కొనసాగుతున్న నేపథ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో జట్ల స్థానాలు మారిపోయాయి. అగ్రస్థానంలో ఉన్న భారత్ తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
కానీ మిగిలిన జట్లలో హైటెన్షన్ మొదలైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి స్ట్రాంగ్ టీమ్స్ ఫైనల్ బెర్తు అవకాశాల సమీకరణాలు మారుతున్నాయి. మొత్తంగా గత రెండు డబ్ల్యూటీసీలకు భిన్నంగా ఈసారి ఫైనల్ బెర్తు రేసు హోరాహోరీగా సాగుతోంది. తాజాగా బంగ్లాదేశ్పై భారత్ 280 పరుగులు, న్యూజిలాండ్పై శ్రీలంక 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో...పాయింట్ల పట్టికలో టీమ్స్ ఆర్డర్ మారిపోయాయి.

నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ఆరో స్థానానాకి పడిపోయింది. న్యూజిలాండ్ మూడు నుంచి జారి నాలుగో స్థానంలోకి వెళ్లింది. శ్రీలంక మూడో స్థానానికి దూసుకొచ్చింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ (71.67 %), ఆస్ట్రేలియా (62.50 %), శ్రీలంక (50 %), న్యూజిలాండ్ (42.85 %), ఇంగ్లండ్ (42.19 %), బంగ్లాదేశ్ (39.29 %), దక్షిణాఫ్రికా (38.89 %), పాకిస్థాన్ (19.05 %), వెస్టిండీస్ (18.52 %) వరుసగా ఉన్నాయి.
భారత్ జోరు చూస్తుంటే ముచ్చటగా మూడో సారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకోవడం ఖాయంగా అనిపిస్తోంది. దీంతో మిగిలిన ఒక్క బెర్తు కోసమే మిగతా జట్లు పోటీపడుతున్నాయి. అయితే ఆసీస్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ ధైర్యంగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. భారత్తో టెస్టు సిరీస్ను కోల్పోతే ఆసీస్ ప్రమాదంలో పడినట్లే. ఆస్ట్రేలియా భారత్తో పాటు శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడనుంది.
సొంతగడ్డపై లంకను ఓడించడం అంత సులువుకాదు. మరోవైపు శ్రీలంక ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్ను క్లీన్స్వీప్ చేసి, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్లో సత్తాచాటితే శ్రీలంక ఆసీస్కు అత్యంత సమీపంగా నిలుస్తుంది. ఇక ఆఖర్లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై పైచేయి సాధిస్తే లంక ఫైనల్ బెర్తు సంపాదించవచ్చు.
మరోవైపు ఆస్ట్రేలియా ఆశలను బంగ్లాదేశ్ తమ ఓటములతో ఆవిరిచేస్తుంది. పాకిస్థాన్పై టెస్టు సిరీస్ గెలిచిన జోరుతో టీమిండియాకు బంగ్లాదేశ్ గట్టిపోటీ ఇస్తుందని, దాంతో తమ విజయశాతానికి రోహిత్ సేన దగ్గరవుతుందని ఆస్ట్రేలియా భావించింది. భారత్ గెలుపు శాతానికి సమీపంగా ఉంటే ఫైనల్ బెర్తు కన్ఫార్మ్ అవుతుందని భావించింది. కానీ బంగ్లా ఘోర ఓటమితో భారత్ విజయ శాతాన్ని భారీగా పెంచేస్తోంది. మొదటి స్థానాన్ని అందుకోవడానికి బదులుగా రెండో స్థానాన్ని కాపాడుకునే పరిస్థితి ఆస్ట్రేలియాకు తలెత్తింది.