మెల్బోర్న్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఢీకొట్టడానికి భారత్-ఆస్ట్రేలియా జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ప్రతిష్ఠాత్మక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఈ రెండు దేశాలు తమ జట్లను ప్రకటించాయి. రెండేళ్లకోసారి జరిగే ఫైనల్ ఇది. 2021లో సౌథాంప్టన్లో జరిగిన లో- స్కోర్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా. ఆ సీజన్లో ఛాంపియన్గా నిలిచింది న్యూజిలాండ్.
ఇప్పుడు న్యూజిలాండ్ ఫైనల్స్లో లేదు. టెస్టుల్లో నిలకడగా రాణించిన టీమిండియా ఈ ఏడాది కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరుకుంది. తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనుంది. ప్రత్యర్థిగా న్యూజిలాండ్ స్థానంలో ఆస్ట్రేలియా వచ్చింది. ఈ ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్స్లో భారత జట్టును ఎదుర్కొనబోతోంది. ఈ రెండింట్లో ఏది గెలిచినా- డబ్ల్యూటీసీ టైటిల్ను సాధించిన మొదటి జట్టవుతుంది.

వచ్చే జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. లండన్లోని ఓవల్ స్టేడియం ఈ దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఆస్ట్రేలియాను ఎదుర్కొనబోయే టీమిండియాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడబోతోంది భారత్. ఇప్పటికే విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ సహా కొందరు క్రికెటర్లు లండన్కు చేరుకున్నారు.
ఐపీఎల్ ఫైనల్స్ ముగిసిన వెంటనే మిగిలిన ప్లేయర్లు కూడా లండన్కు బయలుదేరి వెళ్తారు. ఈ పరిస్థితుల్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. అతని కంటికి గాయమైంది. ఇన్నింగ్ 16వ ఓవర్ ముగిసిన తరువాత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. స్ట్రైకింగ్ ఎండ్ వైపు వెళ్తోన్న సమయంలో పొరపాటున బౌలర్ క్రిస్ జోర్డాన్ను ఢీ కొట్టాడు. క్యాప్ తల మీద పెట్టుకోవడానికి చెయ్యి పైకెత్తిన సమయంలో జోర్డాన్ మోచేయి నేరుగా ఇషాన్ కిషన్ బలంగా తాకింది.

దీనితో నొప్పితో కొద్దిసేపు విలవిల్లాడాడు ఇషాన్ కిషన్. కంటిపై చెయ్యి పెట్టుకుని గ్రౌండ్ను వీడాడు. మళ్లీ వెనక్కి రాలేదు. కంటి గాయం కారణంగా అతను బ్యాటింగ్కు కూడా దిగలేదు. ఇషాన్ కిషన్ స్థానంలో కేప్టెన్ రోహిత్ శర్మతో కలిసి నెహాల్ వధేరా ఇన్నింగ్ను ఆరంభించాడు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో బీసీసీఐ అప్రమత్తమైంది. గాయంపై ఆరా తీస్తోంది.
గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్థానంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్ కోసం ఎంపికయ్యాడు ఇషాన్ కిషన్. ఇప్పుడతని కంటి గాయం డబ్ల్యూటీసీ ఫైనల్స్కు ఎసరు పెట్టేలానే కనిపిస్తోంది. రెండు మూడు రోజుల్లో లండన్కు బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఈ పరిణామం సంభవించడం బీసీసీఐని ఆందోళనకు గురి చేస్తోంది. అతన్నే కొనసాగించాలా? లేక రీప్లేస్ చేయాలా? అనేది పూర్తి నివేదిక అందిన తరువాత నిర్ధారిస్తుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడే టీమిండియాలో- రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్) ఉన్నారు. స్టాండ్బైగా రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ను తీసుకుంది.