మెల్బోర్న్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఢీకొట్టడానికి భారత్-ఆస్ట్రేలియా జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ప్రతిష్ఠాత్మక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఈ రెండు దేశాలు తమ జట్లను ప్రకటించాయి. రెండేళ్లకోసారి జరిగే ఫైనల్ ఇది. 2021లో సౌథాంప్టన్లో జరిగిన లో- స్కోర్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా. ఆ సీజన్లో ఛాంపియన్గా నిలిచింది న్యూజిలాండ్.
ఇప్పుడు న్యూజిలాండ్ ఫైనల్స్లో లేదు. టెస్టుల్లో నిలకడగా రాణించిన టీమిండియా ఈ ఏడాది కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరుకుంది. తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనుంది. ప్రత్యర్థిగా న్యూజిలాండ్ స్థానంలో ఆస్ట్రేలియా వచ్చింది. ఈ ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్స్లో భారత జట్టును ఎదుర్కొనబోతోంది. ఈ రెండింట్లో ఏది గెలిచినా- డబ్ల్యూటీసీ టైటిల్ను సాధించిన మొదటి జట్టవుతుంది.

వచ్చే జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. లండన్లోని ఓవల్ స్టేడియం ఈ దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఆస్ట్రేలియాను ఎదుర్కొనబోయే టీమిండియాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడబోతోంది భారత్. టీమిండియా వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయపడటం ఇప్పుడు అనుకోని అవాంతరాలను మిగిల్చింది.
ఐపీఎల్ 2023 మ్యాచ్ ఆడుతూ కేఎల్ రాహుల్ గాయపడ్డ విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు నాయకత్వాన్ని వహిస్తోన్న ఈ కన్నడిగుడు.. ఈ నెల 1వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తూ కిందపడటంతో కుడి కాలికి గాయమైంది. అదే మ్యాచ్ కోసం 11 బ్యాటర్గా క్రీజ్లోకి దిగినప్పటికీ- అన్ కంఫర్టబుల్గానే కనిపించాడు. వికెట్ల మధ్య పరుగులు తీయడంలో ఇబ్బందిపడ్డాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్స్ నాటికి అతను కోలుకోలేకలేడని బీసీసీఐ ప్రకటించింది. రెండు రోజుల కిందటే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేఎల్ రాహుల్ స్థానంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడే జట్టులో కొత్తగా ఇషాన్ కిషన్ను తీసుకుంది. కొద్దిసేపటి కిందటే ఈ విషయాన్ని వెల్లడించింది బీసీసీఐ. కేఎల్ రాహుల్ తరహాలోనే వికెట్ కీపర్ కమ్ ఓపెనర్గా రాణిస్తోన్న నేపథ్యంలో అతన్ని జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం ఇషాన్ కిషన్.. ఐపీఎల్ మ్యాచ్లను ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతున్నాడు. ఆ జట్టుకు ఫుల్ టైమ్ వికెట్ కీపర్ కూడా అతనే. ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లను ఆడిన ఇషాన్ కిషన్.. 293 పరుగులు చేశాడు. అతని వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్ 75. రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 136.92 స్ట్రైక్ రేట్తో అతని బ్యాటింగ్ సాగుతోంది.
బీసీసీఐ తాజాగా వెల్లడించిన టీమిండియా జట్టులో- రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్) ఉన్నారు. స్టాండ్బైగా రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ను తీసుకుంది.