మెల్బోర్న్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఆడటానికి భారత్-ఆస్ట్రేలియా జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ప్రతిష్ఠాత్మక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఈ రెండు దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. రెండేళ్లకోసారి జరిగే ఫైనల్ ఇది. 2021లో సౌథాంప్టన్లో జరిగిన లో- స్కోర్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా. ఆ సీజన్లో ఛాంపియన్గా నిలిచింది న్యూజిలాండ్.
ఇప్పుడు న్యూజిలాండ్ ఫైనల్స్లో లేదు. టెస్టుల్లో నిలకడగా రాణించిన టీమిండియా ఈ ఏడాది కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరుకుంది. మరోసారి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనుంది. ప్రత్యర్థిగా న్యూజిలాండ్ స్థానంలో ఆస్ట్రేలియా వచ్చింది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్స్లో భారత జట్టును ఎదుర్కొనబోతోంది. ఈ రెండింట్లో ఏది గెలిచినా- డబ్ల్యూటీసీ టైటిల్ను సాధించిన మొదటి జట్టవుతుంది.

విరాట్ కోహ్లీ కేప్టెన్సీలో డబ్ల్యూటీసీ 2021 ఫైనల్స్ ఆడిన టీమిండియా- న్యూజిలాండ్ చేతిలో పరాజయాన్ని చవి చూసింది. వర్షం వల్ల పలుమార్లు అంతరాయం కలిగిన ఆ మ్యాచ్లో బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. సెకెండ్ ఇన్నింగ్లో పిచ్ బ్యాటింగ్కు అనుకూలించడంతో న్యూజిలాండ్ రెచ్చిపోయింది. భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లను నష్టపోయి ఛేదించింది.
ఇక ఈ ఫైనల్స్ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. వచ్చే జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగనుందీ మ్యాచ్. లండన్లోని ఓవల్ స్టేడియం ఈ దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడబోతోంది భారత్. ప్రస్తుతం రోహిత్ శర్మ ఐపీఎల్ ఆడుతున్నాడు. ఇది ముగిసిన వెంటనే లండన్కు బయలుదేరి వెళ్తాడు.
కాగా- ఐపీఎల్ ప్లేఆఫ్స్ నుంచి వైదొలగిన వేర్వేరు జట్లల్లో ఆడుతోన్న టీమిండియా ప్లేయర్లు లండన్ బాట పట్టారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏస్ బౌలర్ మహ్మద్ సిరాజ్- కొద్దిసేపటి కిందటే లండన్ ఫ్లైట్ ఎక్కాడు. ఈ తెల్లవారు జామున శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరినట్లు వెల్లడిస్తూ- ఓ ఫొటోను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఫ్లైట్ విండో ఫొటోను షేర్ చేశాడు.
ఈ ఐపీఎల్లో మహ్మద్ సిరాజ్.. సత్తా చాటిన విషయం తెలిసిందే. తన ఐపీఎల్ కేరీర్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్ను నమోదు చేశాడీ హైదరాబాదీ బౌలర్. 14 మ్యాచ్లను ఆడిన అతను 376 పరుగులు ఇచ్చి 19 వికెట్లను కూల్చాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 4/21. 7.52 ఎకానమీని అందుకున్నాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడే టీమిండియాలో ప్రధాన బౌలర్ అతనే. శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ జయదేవ్ ఉనద్కత్లల్లో తుదిజట్టులో ఎవరిని తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.
టీమిండియాలో- రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్) ఉన్నారు. స్టాండ్బైగా రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ను తీసుకుంది.