
వాషింగ్టన్: చైనాకు చెందిన విమెన్ టెన్నిస్ ప్లేయర్ పెంగ్ షుయ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఆ దేశానికి పీకల్దాకా తీసుకొచ్చాయి. ఈ ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. చైనాను బహిష్కరించింది. చైనాతో పాటు హాంకాంగ్ను కూడా వెలేసింది. ఈ రెండు చోట్ల ఇప్పట్లో టోర్నమెంట్లను నిర్వహించబోమని స్పష్టం చేసింది. షెడ్యూల్ చేసిన టోర్నమెంట్లను కూడా నిర్వహించట్లేదని తెలిపింది.
చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వానికి చెందిన మాజీ ఉన్నతాధికారి ఝాంగ్ గవోలిపై పెంగ్ షుయ్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఝాంగ్ గవోలి.. కమ్యూనిస్టు పార్టీ పొలిట్బ్యురో స్టాండింగ్ కమిటీ సభ్యుడు, మాజీ ఉపాధ్యక్షుడు. గవోలి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ పెంగ్ షుయ్ ప్రకటించారు. దీనిపై చైనా సోషల్ మీడియా సైట్ వీబోలో కిందటి నెల ఓ సమాచారాన్ని షేర్ చేశారు. ఆ తరువాత దాన్ని తొలగించినప్పటికీ.. అది అప్పటికే వైరల్గా మారింది.
తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్న విషయాన్ని వివరిస్తూ- డబ్ల్యూటీఏ ఛైర్మన్ స్టీవ్ సైమన్కు ఆమె ఇమెయిల్ పంపించారు. ఆ తరువాత ఆమె కొద్దిరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. పెంగ్ షుయ్ కనిపించకపోవడంతో టెన్నిస్ ప్లేయర్ల భధ్రత మీదా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఉదంతం మొత్తం మీద డబ్ల్యూటీఏ దర్యాప్తునకు ఆదేశించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ కూడా దీనిపై రెస్పాండ్ అయ్యారు.
పెంగ్ షుయ్ మీద లైంగిక దాడి చోటు చేసుకున్న విషయం నిజమేనని నిర్ధారణ కావడంతో స్టీవ్ సైమన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. చైనాలో అప్ కమింగ్ టెన్నిస్ టోర్నమెంట్లను రద్దు చేశారు. పెంగ్ షుయ్ చేసిన ఆరోపణలపై చైనా ప్రభుత్వం స్పందించకపోవడం, ఝాంగ్ గవోలిపై ఎలాంటి చర్యలను తీసుకోకపోవడం, భవిష్యత్తులో చైనాలో టెన్నిస్ ఆడే మహిళా ప్లేయర్లకు భద్రత ఉండకపోవచ్చనే కారణాలతో డబ్ల్యూటీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
చైనాలో నిర్వహించ తలపెట్టిన టోర్నమెంట్లను రద్దు చేసిన తొలి స్పోర్ట్స్ ఆర్గనైజేషన్గా నిలిచింది డబ్ల్యూటీఏ. దీనిపై చైనా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటిదాకా చైనా ప్రభుత్వం గానీ, అక్కడి స్పోర్ట్ బాడీస్ గానీ, టెన్నిస్ అసోసియేషన్లు గానీ స్పందించలేదు. చైనాతో పాటు హాంకాంగ్లోనూ ఇప్పట్లో డబ్ల్యూటీఏ తరఫున ఎలాంటి ఈవెంట్స్ ఉండబోవని స్టీవ్ సైమన్ స్పష్టం చేశారు. చైనా ప్రభుత్వం స్పందించే తీరును చూసిన తరువాతే.. తమ తదుపరి నిర్ణయాలు ఉంటాయని అన్నారు.