మహిళల టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్ ఘనంగా బోణీ కొట్టింది. రెండో లీగ్ మ్యాచ్లో గెలుపు రుచి చూసిన విండీస్ భారీ నెట్రన్రేటుతో టేబుల్ టాపర్గా దూసుకెళ్లింది. గ్రూప్-బీలో భాగంగా ఆదివారం స్కాట్లాండ్ ఉమెన్స్ టీమ్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ షోతో స్కాట్లాండ్ను చిత్తు చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 99 పరుగులు చేసింది. అయిల్సా లిస్టర్ (26; 33 బంతుల్లో, 1 ఫోర్), కెప్టెన్ బ్రెయిస్ (25; 31 బంతుల్లో, 1 ఫోర్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. వెస్టిండీస్ బౌలర్లలో ఫ్లెచర్ మూడు వికెట్లు, హెన్రీ, హేలీ, రామ్హరక్ తలో వికెట్ తీశారు. ఆది నుంచే విండీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ స్కాట్లాండ్ను కోలుకోకుండా చేశారు.

అనంతరం ఛేదనలో వెస్టిండీస్ 11.4 ఓవరల్లో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా అందుకుంది. క్వియానా జోసెఫ్ (31; 18 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), డియాండ్రా డాటిన్ (28 నాటౌట్; 15 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో ఒలివియా రెండు, ప్రియాన్జ్, రాచెల్ చెరో వికెట్ తీశారు.
50 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకున్న వెస్టిండీస్ గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచింది. రెండు మ్యాచ్లు ఆడిన విండీస్ తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. స్కాట్లాండ్పై విజయంతో +1.154 నెట్రన్రేటుతో టాప్లోకి దూసుకెళ్లింది. తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ (2 పాయింట్లు, +1.050), సౌతాఫ్రికా (2 పాయింట్లు, +0.773), బంగ్లాదేశ్ (2 పాయింట్లు, -0.125) ఉన్నాయి. గ్రూప్-ఏ విషయానికొస్తే.. న్యూజిలాండ్ (2 పాయింట్లు, +2.900), ఆస్ట్రేలియా (2 పాయింట్లు, +1.908), పాకిస్థాన్ (2 పాయింట్లు, +0.555), భారత్ (2 పాయింట్లు, -1.217), శ్రీలంక (-1.667) వరుసగా ఉన్నాయి.