మహిళల టీ20 ప్రపంచ కప్-2024లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. షార్జా వేదికగా స్కాట్లాండ్తో గురువారం జరిగిన మ్యాచ్లో 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ఉమెన్స్ వరల్డ్ కప్లో పదేళ్ల తర్వాత తొలిసారి గెలుపు రుచిచూసింది. 2014 టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లా బరిలోకి దిగుతోంది. తమ సొంతగడ్డపై జరిగిన ఈ మెగాటోర్నీలో మొదటి మూడు మ్యాచ్ల్లో ఓడి ఆ తర్వాత రెండింట్లో గెలిచింది.
అయితే ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్లలో బంగ్లాదేశ్ బరిలోకి దిగుతున్నప్పటికీ ఒక్కటి అంటే ఒక్క మ్యాచ్ కూడా విజయం సాధించలేకపోయింది. వరుసగా 16 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. స్కాట్లాండ్పై విజయంతో ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 119 పరుగులు చేసింది.

శోభన (36; 38 బంతుల్లో, 2 ఫోర్లు), శాంతి రాణి (29; 32 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్లు. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియ మూడు వికెట్లు తీసింది. అనంతరం ఛేదనలో స్కాట్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 103 పరుగులకే పరిమితమైంది. వికెట్ కీపర్ సారా బ్రైస్ (49; 52 బంతుల్లో, 1 ఫోర్) పోరాడింది. బంగ్లా బౌలర్లలో రితూ మోని రెండు వికెట్లు పడగొట్టింది. కాగా, ఈ వరల్డ్ కప్ వాస్తవానికి బంగ్లాదేశ్లో జరగాల్సింది. కానీ ఆ దేశంలో రాజకీయ సంక్షోభంతో శాంతి భద్రతలు అదుపుతప్పడంతో యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు.
తొలి రోజు జరిగిన మరో మ్యాచ్లో ఆసియా ఛాంపియన్స్ శ్రీలంకపై పాకిస్థాన్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 116 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాతిమా (30; 20 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఆటపట్టు, సుగందిక, ప్రబోధని తలో మూడు వికెట్లు తీశారు.అనంతరం ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 85 పరుగులకే పరిమితమైంది. నిలాక్షి (22; 25 బంతుల్లో) పరుగులు చేసింది. సదియా మూడు వికెట్లు, ఫాతిమా, నష్రా, ఒమైమా తలో రెండు వికెట్లు పడగొట్టారు.