
నేను వెయిట్ చేస్తా:
తాజాగా వృద్ధిమాన్ సాహా స్పోర్ట్స్ కీడాతో మాట్లాడుతూ... 'ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్ల్లో రిషబ్ పంత్ ఆడాడు. వాటిల్లో పంత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ పర్యటనలో అతడు మా మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్గా ఉండాలి.నేను తుది జట్టులో స్థానం కోసం వెయిట్ చేస్తా. ఒకవేళ అవకాశం వస్తే నా శక్తి మేరకు పరుగులు చేస్తా. ఆ ఒక్క అవకాశం కోసం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటా' అని అన్నాడు. ఐపీఎల్ 2021, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీసులో పంత్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. గబ్బా టెస్టులో పంత్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి.. టీమిండియాకు టెస్ట్ సిరీస్ అందించిన విషయం తెలిసిందే.

నాలానే ఉండటానికి ప్రయత్నిస్తా:
'పరిస్థితులతో సంబంధం లేకుండా నేను నాలానే ఉండటానికి ప్రయత్నిస్తా. బాగా ఆడినా, ఆడకపోయినా నాలో ఎలాంటి మార్పు ఉండదు. నా చుట్టూ ఉన్న ఇతరులు ఏదైనా భిన్నంగా గుర్తించారో లేదో తెలీదు. ఎప్పుడూ మంచిగా ఆడటానికే ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు మంచి ప్రదర్శన చేస్తాం. మరికొన్ని సార్లు అది సాధ్యం కాకపోవచ్చు. అన్ని అంశాలను ఆధారంగా చేసుకుని యాజమాన్యం తుది జట్టును ఎంపిక చేస్తుంది. దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నా. బాగా ఆడడమే నా పని, తుది జట్టులో అవకాశం నా చేతులో ఉండదు' అని వృద్ధిమాన్ సాహా పేర్కొన్నాడు.

ఇదే తొలిసారి:
సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. క్రికెట్ చరిత్రలో ఛాంపియన్ షిప్ జరగడం ఇదే తొలిసారి. అందుకే అందరి దృష్టి ఈ సమరంపైనే ఉంది. ఫైనల్ అనంతరం ఇంగ్లండ్తో భారత్ ఐదు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటనకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా ఎంపికయ్యారు. అంతేకాదు స్టాండ్ బై ఆంధ్రా కుర్రాడు శ్రీకర్ భరత్ని కూడా బీసీసీఐ ఇంగ్లండ్ పంపనుంది.

20 టెస్టుల్లో 1358 పరుగులు:
ఇప్పటి వరకూ 38 టెస్టులు ఆడిన వృద్ధిమాన్ సాహా చేసిన పరుగులు 1251 మాత్రమే. 29.1 యావరేజ్, 45.3 స్ట్రైక్ రేట్ ఉంది. సాహా మూడు సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు చేశాడు. మరోవైపు 20 టెస్టులు ఆడిన రిషబ్ పంత్ ఇప్పటికే 1358 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక అతడి సగటు 45.26గా ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications
