

హైదరాబాద్: భుజానికి శస్త్రచికిత్స అనంతరం టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చాడు. గత వారంలో సాహాకు మాంచెస్టర్లో సర్జరీ పూర్తయిన సంగతి తెలిసిందే. సాహా కోలుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది.
దీంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లోని పునరావాస కేంద్రానికి సాహా వెళ్లనున్నాడు. సర్జరీ అనంతరం ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు బయల్దేరిన సమయంలో విమానంలో దిగిన ఫోటోను సాహా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నాడు.
సర్జీరీపై సాహా స్పందిస్తూ "చేతిని కదల్చకుండా ఉంచడం చాలా కష్టంగా ఉంది. కానీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలంటే ఇవన్ని తప్పవు. ఈ స్థితిలో పేస్ బౌలర్లను ఎదుర్కోవడం కష్టం. ఆస్ట్రేలియా పర్యటన వరకు కోలుకుంటానని భావిస్తున్నా. ఏం జరుగుతుందో చూద్దాం" అని అన్నాడు.
ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో సాహా క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అతని భుజానికి దెబ్బ తగిలింది. ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి స్వదేశానికి తిరిగొచ్చాడు. ఆ తర్వాత కోలువడంతో ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున కొన్ని మ్యాచ్లు ఆడాడు.
ఐపీఎల్ మ్యాచ్లో ఆడుతున్న సందర్భంగా చేతి వేలికి గాయం కారణంగా లీగ్ దశ నుంచే నిష్క్రమించాడు. అదే సమయంలో భుజం గాయంతో తిరగబెట్టడంతో సాహా మరింతగా బాధపడ్డాడు. దీంతో వైద్యుల సలహాల మేరకు పరీక్షలు నిర్వహించగా ఆపరేషన్ చేయించుకోవాలని సలహా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్కు సాహా దూరమయ్యాడు. బీసీసీఐ ఫిజియోల సూచన మేరకు సాహా ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ డాక్టర్ లెనార్డ్ ఫంక్తో ఈ ఆపరేషన్ చేయించుకున్నాడు.