
పంత్కు ఉద్వాసన:
అక్టోబర్ 2 నుండి దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. వరుసగా విఫలమవుతుండంతో టెస్టుల్లో జట్టు యాజమాన్యానికి పంత్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా కనిపించడం లేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలు వికెట్ల వెనుక చురుగ్గా ఉండే సాహాను మళ్లీ లాంగ్ ఫార్మాట్లోకి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం తెలుస్తోంది. విశాఖ వేదికగా జరిగే తొలి టెస్టులో సాహా ఆడుతాడని బీసీసీఐ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

సాహాకు ఓకే చెప్పిన కెప్టెన్:
'మొదటి టెస్ట్లో పంత్కు తుది అవకాశం ఇచ్చే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారు. కానీ జట్టు మేనేజ్మెంట్ (కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ) సాహానే ఆడాలని కోరుకుంటున్నారు. పంత్ బ్యాట్తో రాణించకపోవడం కీపింగ్పై కూడా ప్రభావం చూపిస్తోంది. బ్యాటింగ్ వైఫల్యం అతని ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తోంది. ఇక డిఆర్ఎస్ సమీక్షలలో వెనకబడే ఉన్నాడు. సాహా అతని కంటే మంచి కీపర్. ఇక లోయర్ ఆర్డర్లో కొన్ని ఉపయోగకరమైన పరుగులు చేస్తాడు' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.

గంగూలీ మద్దతు:
పంత్కు అవకాశాలు ఇవ్వాలని కొందరు అంటుంటే.. ఇక చాలు అని మరికొందరు అంటున్నారు. పంత్కు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ మద్దతు ఇస్తున్నా.. మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మండిపడ్డాడు. పంత్కు ఇచ్చిన అవకాశాలు చాలు, సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకోవాలన్నాడు. 'పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్కు అవకాశాలు ఇస్తున్నారు మంచిదే. కానీ టెస్టుల్లో కూడా అతను ఎందుకంటూ' బెంగాల్ మాజీ కెప్టెన్ దీప్ దాస్గుప్తా తాజాగా ప్రశ్నించారు.

పంత్ కంటే సాహానే అత్యుత్తమం:
దీప్ దాస్గుప్తా మాట్లాడుతూ... 'పంత్ ఆటను పరిశీలిస్తే టెస్టుల్లో అతడు బెస్ట్ చాయిస్ కాదు. పంత్ చివరి టెస్టు ఇన్నింగ్స్లో సరిగా ఆడలేదు. పంత్ టెస్టు ఆటగాడు కాదు. సాహాను టెస్టులకు ఎంపిక చేయాల్సింది. టెస్టుల్లో పంత్ కంటే సాహానే అత్యుత్తమం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుత ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ వికెట్ కీపర్లలో సాహా ఒకడు. రిషబ్ కంటే మంచి బ్యాట్స్మన్. భారత జట్టు ఐదుగురి బౌలర్లతో మ్యాచ్కు సిద్ధమయ్యే క్రమంలో సాహా బ్యాటింగ్పై సందేహాలు ఏర్పడుతున్నాయి. అతను ప్రతీసారి పరుగులు చేస్తున్నాడు. భారత్-ఏ తరఫున కూడా నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు' అని దీప్దాప్ గుప్తా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications
