హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్లెడ్జింగ్ చేయడం తానెప్పుడూ చూడలేదని భారత టెస్ట్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. కొలంబో వేదికగా ప్రత్యర్ధి శ్రీలంకతో ఆదివారం రెండో టెస్టు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 53 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ సిరిస్లో ఆఖరిదైన మూడో టెస్టు ఆగస్టు 12 నుంచి పల్లెకెలెలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సాహా మీడియాతో మాట్లాడాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయడం తప్పనిసరికాదనేది తన అభిప్రాయమని వృద్ధిమాన్ సాహా అన్నాడు. ఎంతో మంది వికెట్ కీపర్లు ఇష్టపడుతున్న ఈ పద్ధతిపై తనకు నమ్మకంలేదని సాహా చెప్పాడు.
'ధోనీ స్లెడ్జింగ్ చేయడం నేనెప్పుడూ చూడలేదు. ఇది తప్పనిసరి కాదని నా అభిప్రాయం. మాటలతో రెచ్చగొట్టినంత మాత్రాన ఎవరూ వికెట్లు సమర్పించుకోరు. కొన్నిసార్లు మాత్రం బ్యాట్స్మెన్కు ఊహించని షాక్లు ఇస్తుంటాం. నీ షాట్ సెలెక్షన్ బాగాలేదు. నువ్వు చెత్త షాట్లు ఆడుతు న్నావంటూ కామెంట్లు చేస్తుంటాం' అని సాహా అన్నాడు.
'ఇలాంటి మాటల వరకు పరవాలేదు. ఇక ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ నాకు ఆదర్శం. చిన్నప్పటి నుంచీ అతని కీపింగ్ చూస్తూ పెరిగాను. అతని బ్యాటింగ్, కీపింగ్ స్టయిల్ అంటే ఎంతో ఇష్టం. మార్క్ బౌచర్, ఇయాన్ హిలీ కీపింగ్ కూడా బాగుంటుంది' అని సాహా తెలిపాడు.
డీఆర్ఎస్పై కోహ్లీ నిర్ణయం తీసుకునే సమయంలో తనతో పాటు, స్లిప్స్లో ఉన్న రహానేను ఎక్కువగా సలహాలు అడుగుతూ ఉండాడని చెప్పుకొచ్చాడు. బ్యాట్స్మెన్ అవుట్ లేదా నాటౌట్ అనే దానిప మా నిర్ణయం తప్పు అయినా మాకు మద్దతుగా నిలుస్తాడని తెలిపాడు.