
సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహాకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) గుడ్ న్యూస్ చెప్పింది. అతనికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అందిస్తున్నట్లు పేర్కొంది. అతనికి సీఏబీకి మధ్య గత కొంతకాలంగా తగాదా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ తగాదాలన్నింటినీ తెగదింపులు చేసిన సీఏబీ అతనికి క్లియరెన్స్ ఇచ్చింది. అతను వచ్చే రంజీ సీజన్కు మెంటార్-కమ్-కెప్టెన్గా త్రిపుర తరఫున ఆడనున్నాడు. బెంగాల్ తరఫున ఇంతకు ముందు సాహా ఆడేవాడనే విషయం తెలిసిందే. ఇక సీఏబీ జాయింట్ సెక్రటరీ దేబబ్రత దాస్.. సాహా విషయంలో కాస్త నొప్పించేలా వ్యాఖ్యలు చేశాడు. బెంగాల్ క్రికెట్ జట్టు పట్ల సాహా నిబద్ధతను అతను ప్రశ్నించాడు. దీంతో సాహా చాలా ఫీలయ్యాడు. సంవత్సరాలుగా రాష్ట్రం కోసం ఆడిన తర్వాత కూడా, ఎన్నో సార్లు ఉత్తమ ప్రదర్శనలు అందించిన తర్వాత కూడా అతను తనను ఇలా ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయాడు. ఇక దీంతో బెంగాల్ జట్టు నుంచి అతను తప్పుకోవడానికి సిద్ధమయ్యాడు. అందుకోసం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను అతను కోరాడు.
'వృద్ధిమాన్ సాహా సీఏబీ ఆఫీసుకు వచ్చారు. అధ్యక్షుడు అవిషేక్ దాల్మియాకు ఒక అప్లికేషన్ రాసి తనకు NOC కావాలని కోరారు. సాహా అభ్యర్థనను సీఏబీ సమ్మతించింది. మరొక రాష్ట్రం తరపున ఆడడానికి అతనికి NOC అందించింది. సీఏబీ అతని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు కూడా తెలియజేసింది' అని సీఏబీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక సాహా గుజరాత్, బరోడా క్రికెట్ అసోసియేషన్లతో సహా మరికొన్ని క్రికెట్ బోర్డులతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక చివరికి త్రిపుర క్రికెట్ అసోసియేషన్ అతన్ని తీసుకుంది. వచ్చే రంజీ ట్రోఫీలో అతను త్రిపుర తరఫున బరిలోకి దిగబోతున్నాడు.
ఇకపోతే ఫస్ట్-క్లాస్ క్రికెట్లో సాహా 122 మ్యాచ్లు ఆడాడు. దాదాపు 42సగటుతో 6423 పరుగులు చేశాడు. అతను 38 అర్ధసెంచరీలు, 13సెంచరీలు కూడా చేశాడు. అతని అత్యధిక స్కోరు 203 నాటౌట్. సాహా టెస్ట్, వన్డేలలో టీమిండియా తరఫున కూడా ఆడాడు. ఇండియా తరఫున 40 టెస్ట్ మ్యాచ్లు ఆడిన సహా, ఆరు హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీలతో 29.41సగటుతో 1,353 పరుగులు చేశాడు. ఇక ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో అతను గుజరాత్ టైటాన్స్ తరఫున చాలా కీలకంగా ఆడాడు.