
ముంబై: ప్రముఖ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా వివాదం సుఖాంతమైంది. ఈ వివాదానికి కారకుడైన స్పోర్ట్స్ జర్నలిస్ట్ బొరియా మజుందార్పై నిషేధం వేటు పడింది. ఆయనను రెండు సంవత్సరాల పాటు నిషేధిస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. వృద్ధిమాన్ సాహాను బెదిరించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు బొరియా మజుందార్. తనకు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల సాహాను బెదిరింపులకు గురి చేస్తూ వాట్సప్ ఛాటింగ్ చేశాడు. దీనిపై సాహా బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు.
ఈ ఆరోపణలపై బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించింది. వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్ అరుణ్ ధుమాల్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ప్రభుతేజ్ భాటియా ఇందులో సభ్యులు. కొద్దిరోజుల కిందటే ఈ విచారణ కమిటీ తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమీక్షించింది. సాహా వ్యవహారంలో జర్నలిస్ట్ బొరియా మజుందార్దే తప్పని తేలడంతో అతనిపై రెండు సంవత్సరాల నిషేధాన్ని విధించింది.
నిషేధ కాలంలో బొరియా మజుందార్ భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లను కలవకూడదు. స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్లకు వెళ్లకూడదు. బీసీసీఐ అతనికి ఎలాంటి అక్రిడేషన్ను జారీ చేయదు. గత నెలలో ఈ విచారణ కమిటీ ముందు వృద్ధిమాన్ సాహా, బొరియా మజుందార్ హాజరయ్యారు. తమ వాదనలను వెల్లడించారు. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు మజుందార్ తనను బెదిరించాడని సాహా పేర్కొనగా.. మరోవైపు సాహా వాట్సప్ చాట్ను తారుమారు చేసి స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఆరోపించాడు.
ఇద్దరి వాదనలు, వివరణలను పరిగణలోకి తీసుకున్న విచారణ కమిటి నిజానిజాలు నిగ్గుతేల్చింది. తన సిఫారసులను బీసీసీఐకి అందజేసింది. దీనికి అనుగుణంగా తన తాజా నిర్ణయాన్ని వెల్లడించింది బీసీసీఐ. ఈ సమాచారాన్ని అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు తెలియజేయాల్సి ఉంది. వృద్ధిమాన్ సాహా వ్యవహారంలో బొరియా మజుందార్దే తప్పని విచారణ కమిటీలో తేలిన నేపథ్యంలో.. తమ పరిధుల్లోని స్టేడియాల్లో జరిగే మ్యాచ్లకు అతను హాజరు కాకుండా చూడాలని సూచించనుంది.