ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్కు రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. అలైస్ క్యాప్సె (75; 53 బంతుల్లో) అర్ధశతకంతో విజృంభించింది. జెమిమా రోడ్రిగ్స్ (42; 24 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.
కాగా, ఢిల్లీ క్యాపిటల్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ (1; 8 బంతుల్లో) షబ్నిమ్ ఇస్మాయిల్ స్టన్నింగ్ డెలివరితో క్లీన్ బౌల్డ్ చేసింది. అయితే వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన అలైస్ క్యాప్సె ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చింది. 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో సత్తాచాటింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (31; 25 బంతుల్లో)తో కలిసి రెండో వికెట్కు అర్ధశతక (64 రన్స్) భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

అనంతరం మెగ్ లానింగ్ ఔటైన తర్వాత జెమిమా క్రీజులోకి వచ్చింది. జెమిమా దూకుడైన బ్యాటింగ్తో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో వీరిద్దరు ఔటయ్యారు. మారిజానే (16; 9 బంతుల్లో) బ్యాటు ఝుళిపించడంతో చివరి రెండు ఓవర్లలో ఢిల్లీకి 24 పరుగులు వచ్చాయి. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో నాట్ స్కివర్, అమెలియా చెరో రెండు వికెట్లు, షబ్నిమ్ ఒక్క వికెట్ తీశారు.
కాగా, అంతకుముందు డబ్ల్యూపీఎల్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారాలోకం కదిలివచ్చింది. ఆటపాటలతో అభిమానులను అలరించింది. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తిక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ తమ ప్రదర్శనలతో ఫ్యాన్స్ను ఉర్రూతలూగించారు.