
మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు అంతా సిద్ధమైంది. తాజాగా ముగిసిన వేలంతో ఈ టోర్నీలో పాల్గొనే జట్లు కూడా ఖరారయ్యాయి. మొత్తం ఐదు జట్లు ఈ టోర్నీలో తలపడేందుకు రెడీగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ ఫ్రాంచైజీలు వేలంలో మంచి జట్లను తయారు చేసుకున్నాయి.
వేలంలో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. ఆమె కోసం ఆర్సీబీ జట్టు రూ.3.4 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అలాగే ఢిల్లీ కూడా షెఫాలీ వర్మ సహా పలువురు కీలక ఆటగాళ్లతో బలమైన జట్టును సిద్ధం చేసుకుంది. వేలం ముగియడంతో టోర్నీకి అవసరమైన కీలకమైన దశ పూర్తయినట్లు అయింది. దీంతో ఇక టోర్నీ ప్రారంభం అవడమే మిగిలింది.
వచ్చే నెల 4వ తేదీన డబ్ల్యూపీఎల్ ప్రారంభం అవనుంది. డీవై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత ఆదివారం మార్చి 5వ తేదీన రెండు మ్యాచులు జరుగుతాయి. ఈ టోర్నీ మొత్తంలో నాలుగు సార్లు డబుల్ హెడర్స్ జరగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచులు సాయంత్రం 3.30 గంటలకు జరుగుతాయి. సాయంత్రం జరిగే మ్యాచులు 7.30కు మొదలవుతాయి.
డీవై పాటిల్ స్టేడియం, బ్రబోర్న్ స్టేడియం, ముంబై.. మూడు స్టేడియాల్లో ఒక్కో మైదానంలో 11 మ్యాచులు జరుగుతాయి. లీగ్ దశలో చివరి మ్యాచ్ మార్చి 21న బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో యూపీ, ఢిల్లీ జట్టు తలపడతాయి. 24వ తేదీన డీవై పాటిల్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ మార్చి 26న బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ మొత్తాన్ని బీసీసీఐ తాజాగా ప్రకటించింది.