ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. ఢిల్లీ వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న తుదిపోరులో ఆర్సీబీ స్పిన్నర్లు సత్తాచాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (44; 27 బంతుల్లో) టాప్ స్కోరర్.
అయితే ఓ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ 64/0తో టాప్లో నిలిచింది. షెఫాలీ వర్మ బౌండరీలతో హోరెత్తించింది. రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. మరో ఓపెనర్, ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (23; 23 బంతుల్లో) నిలకడగా ఆడటంతో పవర్ప్లేలో ఢిల్లీ 61 పరుగులు చేసింది.

కానీ సోఫీ మొలినెక్స్ మ్యాచ్ను మలుపు తిప్పింది. ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టింది. హ్యాట్రిక్ మిస్ అయినప్పటికీ నాలుగు బంతుల వ్యవధిలో షెఫాలీ, జెమీమా రోడ్రిగ్స్ (0), అలీస్ క్యాప్సీ (0)ను పెవిలియన్కు చేర్చింది. ఆ తర్వాత మ్యాచ్ ఆర్సీబీ కంట్రోల్లోకి వెళ్లింది. పవర్ప్లే తర్వాత ఏడు ఓవర్లలో ఢిల్లీ కేవలం 19 పరుగులే చేసింది.
డ్రింక్స్ బ్రేక్ అనంతరం గేర్ మారుద్దామనుకున్న ఢిల్లీకి ఆర్సీబీ బౌలర్లు ఛాన్స్ ఇవ్వలేదు. శోభన ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసింది. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఢిల్లీని బెంగళూరు ఒత్తిడిలోకి నెట్టింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయంక పాటిల్ నాలుగు, సోఫీ మూడు వికెట్లు, శోభన రెండు వికెట్లు తీశారు. ఢిల్లీ బ్యాటర్లలో షెఫాలీ, లానింగ్, రాధా యాదవ్ (12; 9 బంతుల్లో), అరుంధతి (10; 13 బంతుల్లో) మినహా మిగిలినెవరూ రెండంకెల స్కోరును అందుకోలేదు.