రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ టీమ్ అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ను చిత్తు చేసి ఫైనల్కు దూసుకెళ్లింది. ఢిల్లీ వేదికగా శుక్రవారం ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబైపై బెంగళూరు అయిదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫీల్డింగ్ తప్పిదాలతో ఓ దశలో ఓటమి దిశగా సాగిన ఆర్సీబీ అద్భుతంగా పోరాడింది. కీలక సమయంలో ఒత్తిడి జయించి ఫైనల్కు చేరింది. టైటిల్ పోరులో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో బెంగళూరు తలపడనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (66; 50 బంతుల్లో) మరోసారి జట్టును ఆదుకుంది. అనంతరం ఛేదనకు వచ్చిన ముంబై 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33; 30 బంతుల్లో), అమెలీ కేర్ (27; 25 బంతుల్లో) పోరాడారు. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయంక పాటిల్ రెండు వికెట్లతో మెరిసింది.

ముంబై ఇండియన్స్ ఛేదనను నిలకడగా ఆరంభించింది. ఓపెనర్లు యస్తికా భాటియా (19; 27 బంతుల్లో), హేలీ మాథ్యూస్ (15; 14 బంతుల్లో) జాగ్రత్తగా బ్యాటింగ్ మొదలుపెట్టారు. మాథ్యూస్ గేర్ మార్చి దూకుడుగా ఆడే యత్నంలో శ్రేయంక పాటిల్ బౌలింగ్లో వెనుదిరిగింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన నాట్ సీవర్ (23; 17 బంతుల్లో) కూడా రిస్క్ షాట్లు ఆడకపోవడంతో ముంబై పవర్ప్లేలో 37 పరుగులు చేసింది.
అయితే ఎలీస్ పెర్రీ స్టన్నింగ్ డెలివరీతో యస్తికాను క్లీన్బౌల్డ్ చేసింది. కాసేపటికే నాట్ సీవర్ కూడా వెనుదిరగడంతో ఆర్సీబీ మ్యాచ్పై పట్టుబిగించింది. కానీ అమెలీ కేర్తో కలిసి హర్మన్ప్రీత్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించింది. మరోవైపు ఆర్సీబీ పేలవ ఫీల్డింగ్ కూడా ముంబై కలిసొచ్చింది. ఒత్తిడిని క్రమంగా జయించింది. డ్రింక్స్ బ్రేక్ అనంతరం హర్మన్ప్రీత్ బౌండరీలతో హెరెత్తించింది.
దీంతో ముంబై విజయ సమీకరణం ఆఖరి 18 బంతుల్లో 20 పరుగులుగా మారింది. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు అసలైన పోరాటం చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ముంబైని ఒత్తిడిలోకి నెట్టారు. 18వ ఓవర్లో శ్రేయంక, 19వ ఓవర్లలో సోఫీ నాలుగు పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టారు. 20వ ఓవర్ వేసిన శోభన ఎలాంటి పొరపాటు చేయకుండా ఆర్సీబీని విజయతీరాలకు చేర్చింది.
ఎలీస్ పెర్రీ విధ్వంసం
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్ మూడు బౌండరీలు సాధించి జోర మీదున్న ఆర్సీబీ ఓపెనర్లు సోఫీ డివైన్ (10; 7 బంతుల్లో), స్మృతి మంధాన (10; 7 బంతుల్లో) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. మూడు బంతుల వ్యవధిలోనే వికెట్లు కోల్పోయారు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన దిశా ఏడు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకముందే పెవిలియన్కు చేరింది. దీంతో 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
మరోవైపు రిచా ఘోష్ (14; 19 బంతుల్లో)తో కలిసి ఎలీస్ పెర్రీ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించింది. రిచా, ఎలీస్ నిదానంగా ఆడటంతో రన్రేట్ క్రమంగా తగ్గిపోయింది. ఈ దశలో మాథ్యూస్ రిచాను ఔట్ చేసి బెంగళూరుకు షాక్ ఇచ్చింది. రిచాతో కలిసి ఎలీస్ పెర్రీ నాలుగో వికెట్కు 26 పరుగులు, సోఫీ మొలినెక్స్ (11; 17 బంతుల్లో)తో కలిసి అయిదో వికెట్కు 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
మరోవైపు ఎలిస్ పెర్రీ చెత్త బంతుల్ని బౌండరీకి తరలిస్తూ స్కోరుబోర్డు ముందుకు నడిపించింది. 40 బంతుల్లో అర్ధసెంచరీ సాధించింది. దూకుడుగా ఆడే క్రమంలో ఆఖరి ఓవర్లో వికెట్ కోల్పోయింది. చివరి అయిదు ఓవర్లలో ఆర్సీబీ 51 పరుగులు సాధించింది. జార్జియా వేర్హమ్ (18*; 10 బంతుల్లో) చివరి బంతిని సిక్సర్గా మలిచింది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్సూస్, నాట్ సీవర్, సైకా తలో రెండు వికెట్లు తీశారు.