ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఈ పోరాడే స్కోరు సాధించిందంటే ఎలిస్ పెర్రీ (66; 50 బంతుల్లో) విధ్వంసంతోనే. సహచరులు వెనుదిరుగుతున్నా పెర్రీ గొప్పగా బ్యాటింగ్ చేసింది. ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ సాధించింది. ఆఖర్లో ఉగ్రరూపం చూపించింది. జార్జియా వేర్హమ్ (18*; 10 బంతుల్లో) చివరి బంతిని సిక్సర్గా మలిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. ఆర్సీబీ ఓపెనర్లు సోఫీ డివైన్ (10; 7 బంతుల్లో), స్మృతి మంధాన (10; 7 బంతుల్లో) దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి ఓవర్లోనే మూడు బంతులు సాధించారు. కానీ మూడు బంతుల వ్యవధిలోనే వికెట్లు కోల్పోయారు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన దిశా ఏడు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకముందే పెవిలియన్కు చేరింది. దీంతో 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

మరోవైపు రిచా ఘోష్ (14; 19 బంతుల్లో)తో కలిసి ఎలీస్ పెర్రీ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించింది. రిచా, ఎలీస్ నిదానంగా ఆడటంతో రన్రేట్ క్రమంగా తగ్గిపోయింది. ఈ దశలో మాథ్యూస్ రిచాను ఔట్ చేసి బెంగళూరుకు షాక్ ఇచ్చింది. రిచాతో కలిసి ఎలీస్ పెర్రీ నాలుగో వికెట్కు 26 పరుగులు, సోఫీ మొలినెక్స్ (11; 17 బంతుల్లో)తో కలిసి అయిదో వికెట్కు 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
మరోవైపు ఎలిస్ పెర్రీ చెత్త బంతుల్ని బౌండరీకి తరలిస్తూ స్కోరుబోర్డు ముందుకు నడిపించింది. 40 బంతుల్లో అర్ధసెంచరీ సాధించింది. దూకుడుగా ఆడే క్రమంలో ఆఖరి ఓవర్లో వికెట్ కోల్పోయింది. చివరి అయిదు ఓవర్లలో ఆర్సీబీ 51 పరుగులు సాధించింది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్సూస్, నాట్ సీవర్, సైకా తలో రెండు వికెట్లు తీశారు.