WPL 2026: మహిళా ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన 11వ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన ఆర్సీబీ.. ఈ సీజన్లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయానంతరం కెప్టెన్ స్మృతి మంధాన తమ జట్టు విజయ రహస్యాన్ని పంచుకున్నారు.
బౌలర్ల విజృంభణ.. ఆదిలోనే దెబ్బకొట్టిన సాయలీ, బెల్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా అరంగేట్ర ప్లేయర్ సాయలీ సత్ఘరే, విదేశీ స్టార్ లారెన్ బెల్ పదునైన బౌలింగ్తో ఢిల్లీ టాపార్డర్ను కుప్పకూల్చారు. తొలి 2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకానొక దశలో 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ.. షెఫాలీ వర్మ (62 పరుగులు) పోరాడటంతో ఢిల్లీ 166 పరుగులు చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో బెల్, సాయలీ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

మంధాన వీరవిహారం: తృటిలో చేజారిన సెంచరీ
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి కెప్టెన్ స్మృతి మంధాన అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. కేవలం 61 బంతుల్లో 96 పరుగులు (13 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి జట్టును గెలుపు ముంగిట నిలిపింది. కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ, ఆమె మెరుపు ఇన్నింగ్స్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. మరోవైపు జార్జియా వోల్ (54*) కీలక ఇన్నింగ్స్ ఆడింది.
గెలుపుపై స్మృతి మంధాన ఏమన్నారంటే?
మ్యాచ్ అనంతరం ప్రెజంటేషన్ వేడుకపై స్మృతి మంధాన తన జట్టు ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. "బౌలర్లు ప్లానింగ్ను అద్భుతంగా అమలు చేశారు. ముఖ్యంగా మొదటి 3 ఓవర్లలో 4 వికెట్లు తీయడం మ్యాచ్ను మలుపు తిప్పింది. అరంగేట్ర మ్యాచ్లోనే సాయలీ రెండు కీలక వికెట్లు తీయడం విశేషం. షెఫాలీ వర్మ ధాటిగా ఆడుతున్న సమయంలో మేము ప్లాన్ మార్చి, ఆమెకు సింగిల్స్ ఇచ్చి ఒత్తిడి పెంచాం. టీమ్ అంతా సమిష్టిగా కృషి చేయడం వల్లే ఈ అజేయ విజయం సాధ్యమైంది." అని ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించారు.
తదుపరి ప్రయాణం వడోదర వైపు
ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆర్సీబీ, జనవరి 18న వడోదరకు ప్రయాణం కానుంది. టోర్నీలో మిగిలిన మ్యాచ్లన్నీ అక్కడే జరగనున్నాయి. ఇదే ఊపును వడోదరలో కూడా కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.