WPL 2026: మహిళా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ నేటి నుంచే ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్, స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తొలి పోరులో తలపడనున్నాయి. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ ఈ ఉత్కంఠభరిత పోరుకు వేదిక కానుంది.
గ్రాండ్ ఓపెనింగ్
మ్యాచ్ ప్రారంభానికి ముందు సాయంత్రం 6.45 గంటలకు మైదానంలో అట్టహాసంగా ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో ప్రముఖ సంగీత దర్శకుడు యో యో హనీ సింగ్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నెండెజ్ తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. అలాగే మాజీ మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు కూడా ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మహిళా క్రీడాకారుల స్ఫూర్తిని చాటిచెప్పనున్నారు. ఈ వినోద కార్యక్రమం అనంతరం రాత్రి 7:00 గంటలకు టాస్ పడనుండగా.. 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

టీమ్ బలాబలాలు: హర్మన్ vs స్మృతి
ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. హర్మన్ప్రీత్తో పాటు నాట్ సీవర్-బ్రంట్, అమెలియా కెర్, హీలీ మాథ్యూస్ వంటి వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్లు జట్టుకు ప్రధాన బలం. మరోవైపు ఆర్సీబీ జట్టులో స్మృతి మంధాన, రిచా ఘోష్లతో పాటు గ్రేస్ హారిస్, నదైన్ డి క్లర్క్ వంటి హిట్టర్లు ఉన్నారు. స్టార్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్కు దూరం కావడం ఆర్సీబీకి కొంత లోటు అయినప్పటికీ, యువ ప్రతిభతో జట్టును విజయపథంలో నడిపించాలని స్మృతి పట్టుదలతో ఉంది.
లైవ్ మ్యాచ్ ఎక్కడ చూడాలంటే?
ఈ మ్యాచ్ను టీవీలో చూడాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానళ్లను వీక్షించవచ్చు. ఇక మొబైల్ లేదా వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ కోసం జియో హాట్స్టార్ అందుబాటులో ఉంటుంది. ఈ టోర్నమెంట్ మొత్తం రెండు దశల్లో జరుగుతుంది. మొదటి 11 మ్యాచ్లు నవీ ముంబైలో జరగనుండగా.. మిగిలిన 11 మ్యాచ్లు, ప్లేఆఫ్స్ (ఫైనల్ సహా) వడోదరలోని కొటాంబి స్టేడియంలో ఫిబ్రవరి 5వ తేదీ వరకు కొనసాగుతాయి.