డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా యూపీ వారియర్స్తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ ఆష్లే గార్డనర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయం జట్టులో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఆమె పేర్కొన్నారు.
200 పరుగులే లక్ష్యంగా..
మ్యాచ్ అనంతరం గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ ఆష్లే గార్డనర్ మాట్లాడుతూ.. "ఈ మైదానంలో పరుగులు ఎంత వేగంగా వస్తాయో ఈ మ్యాచ్ నిరూపించింది. 11 ఓవర్లు ముగిసే సమయానికే, మేము కనీసం 200 పరుగులు సాధించాలని నిర్ణయించుకున్నాం. ఫోబ్ లిచ్ఫీల్డ్ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే అది తప్పనిసరి అనిపించింది. మేము బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మంచి ప్రదర్శన చేశాం, కానీ మా ఫీల్డింగ్ అద్భుతంగా సాగింది. అదే చివరికి మ్యాచ్ ఫలితంలో తేడా చూపింది" అని గార్డనర్ విశ్లేషించారు.

అనుష్క శర్మపై ప్రశంసల జల్లు
అరంగేట్ర మ్యాచ్లోనే మెరిసిన యువ ప్లేయర్ అనుష్క శర్మ గురించి గార్డనర్ ప్రత్యేకంగా మాట్లాడారు. "అనుష్క చాలా ప్రత్యేకమైన క్రీడాకారిణి. ఇప్పటి వరకు ఆమెను కేవలం నెట్స్లో మాత్రమే చూశాను. కానీ మైదానంలో ఆమెతో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆమె ఆటను చాలా సింపుల్గా ఉంచుతుంది, అలాగే మైదానంలో అన్ని వైపులా షాట్లు ఆడగలదు. అంత చిన్న వయసులో అంత ధైర్యంగా ఆడటం నన్ను ఆకట్టుకుంది" అని కొనియాడారు.
లిచ్ఫీల్డ్ వికెట్ - టర్నింగ్ పాయింట్
యూపీ బ్యాటర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ విధ్వంసాన్ని ఆపడం తమకు సవాల్గా మారిందని గార్డనర్ అంగీకరించారు. "లిచ్ఫీల్డ్ ప్రమాదకరమైన ప్లేయర్. ఆమెను ఆపడానికి మేము తీవ్రంగా ప్రయత్నించాం. జార్జియా వేర్హామ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. లిచ్ఫీల్డ్ వికెట్ పడగానే మ్యాచ్ మా వైపు మలుపు తిరిగింది. మా బౌలింగ్లో మంచి డెప్త్ ఉంది, ఎవరికి బంతి ఇచ్చినా వికెట్ తీస్తారనే నమ్మకం నాకుంది" అని ధీమా వ్యక్తం చేశారు.