డబ్ల్యూపీఎల్ 2025లో ఎట్టకేలకు గుజరాత్ జెయింట్స్ బోణీ కొట్టింది. ఈ సీజన్ లో రీసెంట్ గా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన ఆ జట్టు.. ఇప్పుడు యూపీ వారియర్స్ పై నెగ్గి తొలి విజయాన్ని నమోదు చేసింది. 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆష్లీ గార్డ్నర్, డాటిన్, ప్రియా మిశ్రా, హర్లీన్ డియోల్.. గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఈ డబ్ల్యూపీఎల్లో వరుసగా మూడో మ్యాచ్లోనూ ఛేదించిన జట్టే విజయం సాధించడం విశేషం.
మ్యాచ్ సాగిందిలా..
మొదట యూపీ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేసింది. రెండో ఓవర్ లోనే ఓపెనర్ కిరణ్ నవిగిరె (15)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో వారియర్స్ పతనం మొదలైంది. ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ వృంద (6)ను కూడా పెవిలియన్ చేరింది. అలా 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో వారియర్స్ను కెప్టెన్ దీప్తి శర్మ (27 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 39), ఉమా ఛెత్రి (27 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 24) ఆదుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఎక్కువ సేపు దూకుడుగా ఆడలేకపోయారు. అనంతరం ఒకే ఓవర్లో తాలియా (0), గ్రేస్ హారిస్ (4) కూడా ఔట్ అవ్వడంతో వారియర్స్ చిక్కుల్లో పడింది. సెహ్రావత్, ఎకిల్ (2) వెంటనే వెనుదిరిగారు. కానీ చివర్లలో అలాన కింగ్ (19 నాటౌట్; 14 బంతుల్లో 2×4, 1×6), సైమా ఠాకూర్ (15; 7 బంతుల్లో 3×4) మెరుపులు మెరిపించడంతో యూపీ 143 పరుగులు అయినా చేయగలిగింది. గుజరాత్ బౌలరలలో ప్రియా మిశ్రా (3/25) వికెట్లు పడగొట్టగా... డాటిన్ (2/34), ఆష్లీ గార్డ్నర్ (2/39) వికెట్లు తీశారు.

ఆరంభంలోనే షాక్.. అయినా విజయం..
స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. మొదట రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది గుజరాత్. అప్పుడు ఆష్లీ గార్డ్నర్ (52; 32 బంతుల్లో 5×4, 3×6) ధాటిగా బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ను నిలబెట్టింది. లారా వోల్వార్ట్ (22; 24 బంతుల్లో 2×4, 1×6)తో మూడో వికెట్కు 55, హర్లీన్ డియోల్తో నాలుగో వికెట్కు 29 పరుగులు జోడించి పెవిలియన్ చేరింది. తర్వాత హర్లీన్తో కలిసి డాటిన్ బౌండరీలు బాదేస్తూ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లింది. దీంతో ఐదో వికెట్కు 58 పరుగులు జోడించిన డాటిన్-హర్లీన్ జంట... గుజరాత్ను విజయతీరాలకు చేర్చింది. సోఫీ ఎకిల్స్టోన్ (2/16) వికెట్లు తీయగా.. గ్రేస్ హారిస్, తహిలా మెక్గ్రాత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. గార్డ్నర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.