డబ్ల్యూపీఎల్ సీజన్ 3లో దిల్లీ క్యాపిటల్స్ చరిత్ర సృష్టించింది. ఆఖరి లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబయి ఇండియన్స్ ఓడిపోవడంతో దిల్లీ ఫైనల్ కు అర్హత సాధించింది. తద్వారా వరుసగా మూడు సార్లు ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. వాస్తవానికి ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. కానీ మెరుగైన రన్రేట్ కారణంగా ముంబయి (0.192)ను వెనక్కి నెట్టి దిల్లీ (0.396) తుది పోరుకు చేరుకుంది. దిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో టాప్ లో నిలిచింది.
విజయంతో ముగించిన ఆర్సీబీ..
తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆల్రౌండ్ ప్రదర్శన చేసి ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. దీంతో బెంగళూరు జట్టు.. ముంబయి ఇండియన్స్ను 11 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (37 బంతుల్లో 6×4, 3×6 సాయంతో 53 పరుగులు), ఎలీస్ పెర్రీ (38 బంతుల్లో 5×4, 1×6 సాయంతో 49 నాటౌట్) ఆటే మ్యాచ్ కు హైలైట్. ఈ ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలిచారు. రిచా ఘోష్ (36; 22 బంతుల్లో 5×4, 1×6) మంచి ప్రదర్శనే చేసింది. చివర్లో పెర్రీ, జార్జియా వేర్హామ్ (10 బంతుల్లో 5×4, 1×6 సాయంతో 31 నాటౌట్) చెలరేగి ఆడడంతో ఆర్సీబీ ఊహించని స్కోరు చేసింది. చివరి రెండు ఓవర్లలో బెంగళూరు 39 పరుగులు చేసింది. మంబయి బౌలర్లలో హేలీ మాథ్యూస్ (2/37) వికెట్లు తీసింది.

ఛేదనలో నాట్ సీవర్ (35 బంతుల్లో 69; 9×4, 2×6) చేసినా ఫలితం దక్కలేదు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (20), యాస్తిక (4), అమన్జ్యోత్ కౌర్ (17), కమలిని (6) తక్కువ స్కోర్లకే వెనుదిరగారు. చివర్లో సజన (23) చేసింది. దీంతో ముంబయి 9 వికెట్లకు 188 పరుగులే చేసింది. స్నేహ్రాణా (3/26), ఎలీస్ పెర్రీ (2/53), కిమ్ గార్త్ (2/33) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
గురువారం (మార్చి 13) గుజరాత్ జెయింట్స్తో ముంబయి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు వరుసగా ఐదు ఓటములతో ప్లేఆఫ్స్ రేసుకు ఇప్పటికే దూరంగా ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు విజయంతో టోర్నీని ముగించింది.