ఈ సారి మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో వరుసగా ఛేదించే జట్లే గెలుస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఒరవడినే కొనసాగిస్తూ తాజాగా జరిగిన మ్యాచ్ లో దిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకుంది. తద్వారా ఈ సీజన్ లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వడోదరా వేదికగా జరిగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. అనాబెల్ సదర్లాండ్ ఆల్రౌండ్ షోతో దిల్లీ ఈ విజయాన్ని అందుకోగలిగింది.
మ్యాచ్ సాగిందిలా..
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ లో మెగ్ లానింగ్ (49 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 69 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. అనాబెల్ సదర్లాండ్ (35 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 41 నాటౌట్), మరిజేన్ కాప్ (17 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 29 నాటౌట్) మెరుపులు మెరిపించారు. దీంతో దిల్లీ 19.5 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెఫాలి (16 బంతుల్లో 3×4, 1×6 సాయంతో 26 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. యూపీ బౌలర్లలో గ్రేస్ హారిస్ (1/11), దీప్తి శర్మ (1/27) మంచి ప్రదర్శన చేశారు.

మలుపు తిప్పిన మిస్ క్యాచ్..
దిల్లీ ఇన్నింగ్స్ మధ్యలో యూపీ బౌలర్లు కాస్త పుంజుకున్నారు. అయినా కూడా దిల్లీ బ్యాటర్లు ఆచితూచి ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. దిల్లీ 29 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన దశలో సదర్లాండ్ క్యాచ్ను ఎకిల్స్టోన్ వదిలేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివర్లోనూ ఓ క్యాచ్ తో పాటు ఓ రనౌట్ అవకాశాన్ని యూపీ చేజార్చుకుంది.
అంతకుముందు దిల్లీ ప్లేయర్లలో ఓపెనర్ కిరణ్ నవ్ గిరె (27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 51 పరుగులు), శ్వేత సెహ్రావత్ (33 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 37 పరుగులు), హెన్రీ (15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 33 నాటౌట్) రాణించారు. దిల్లీ బౌలర్లలో అనాబెల్ 2 వికెట్లు పడగొట్టింది.
Until we meet again, Vadodara 🫡 pic.twitter.com/lk1csoSeMI
— Delhi Capitals (@DelhiCapitals) February 19, 2025
Until we meet again, Vadodara 🫡 pic.twitter.com/lk1csoSeMI
— Delhi Capitals (@DelhiCapitals) February 19, 2025