ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన (53; 44 బంతుల్లో) అదరగొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన మేఘన అరంగేట్ర మ్యాచ్లోనే అర్ధశతకం సాధించింది. 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రిచా ఘోష్తో కలిసి మేఘన ఆదుకుంది. 40 బంతుల్లో అర్ధశతకం సాధించింది. 27 ఏళ్ల మేఘన ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన క్రికెటర్.
లీగ్ షెడ్యూల్ భాగంగా బెంగళూరు వేదికగా ఇవాళ యూపీ వారియర్స్తో ఆర్సీబీ తలపడుతున్న విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 156 పరుగులు చేసింది. మేఘన, రిచా ఘోష్ (62; 37 బంతుల్లో) అర్ధశతకాలతో సత్తాచాటారు.

అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. పవర్ప్లేలోనే ఓపెనర్లను కోల్పోయింది. సోఫి డివైన్ (1; 5 బంతుల్లో) నిరాశపరచగా, కెప్టెన్ స్మృతి మంధాన (13; 11 బంతుల్లో) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. కాసేపటికే స్టార్ ప్లేయర్ ఎలిస్ పెర్రీ (8; 7 బంతుల్లో) కూడా ఔటైంది. దీంతో ఆర్సీబీ ఒత్తిడిలోకి వెళ్లింది. కానీ మేఘనతో కలిసి రిచా ఘోష్ ఇన్నింగ్స్ చక్కదిద్దింది.
మేఘన సంయమనంతో ఆడితే రిచా ఘోష్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. వీరిద్దరు నిలకడగా పరుగులు చేస్తూ నాలుగో వికెట్కు 71 పరుగులు జోడించారు. కానీ గేర్ మార్చి దూకుడుగా ఆడే యత్నంలో మేఘన.. రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్లో స్టంపౌటైంది. రాజేశ్వరి అదే ఓవర్లో జార్జియా (0; 3 బంతుల్లో)ను కూడా ఔట్ చేసి బెంగళూరును దెబ్బకొట్టింది.
అప్పటికీ ఆర్సీబీ స్కోరు 17 ఓవర్లకు 126/5 మాత్రమే. కానీ ఆ తర్వాత రిచా ఘోష్ చెలరేగింది. వరుస బౌండరీలతో హోరెత్తించింది. ఈ క్రమంలో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకుంది. 18వ ఓవర్ వేసిన తాహిలా మెకాగ్రత్ బౌలింగ్లో వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు బాది 15 పరుగులు పిండుకుంది. కానీ తర్వాత ఓవర్లోనే దీప్తి శర్మ బౌలింగ్లో రిచా ఔటైంది. ఆఖర్లో సోఫీ మోలినెక్స్ (9; 9 బంతుల్లో), శ్రెయాంక పటిల్ (8; 4 బంతుల్లో) బ్యాటు ఝుళిపించడంతో ఆర్సీబీ 156 పరుగులు చేసింది.