ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్తో రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బౌలింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావం చూపిస్తుందని భావించి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు తెలిపింది.
అయితే రెండో సీజన్ ప్రారంభమైన కొద్దిసేపటికే తొలి వికెట్ పడింది. ఢిల్లీ ఓపెనర్ షెఫాలీ వర్మ (1; 8 బంతుల్లో)ను ముంబయి ఫాస్ట్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయల్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్బౌల్డ్ చేసింది. షబ్నిమ్ నిప్పులు చెరిగే బంతికి మిడిల్ స్టంప్ ఎగిరిపడింది. ఆ బంతిని చూసి షాకైన షెఫాలీ.. ఆ తర్వాత తేరుకుని నిరాశగా మైదానాన్ని వీడింది.

దీంతో ఢీల్లీకి పేలవమైన ఆరంభం లభించింది. మూడు పరుగుల వద్ద షెఫాలీ వికెట్ కోల్పోయింది. కానీ వన్డౌన్లో వచ్చిన అలైస్ కాప్సీ (67*; 47 బంతుల్లో)తో కలిసి కెప్టెన్ మెగ్ లానింగ్ (31; 25 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించింది. రెండో వికెట్కు అర్ధశతక భాగస్వామ్యాన్ని (64 పరుగులు) నమోదు చేసింది. అనంతరం నాట్ స్కివర్ బౌలింగ్లో వెనుదిరిగింది.
కాగా, అంతకుముందు డబ్ల్యూపీఎల్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారాలోకం కదిలివచ్చింది. ఆటపాటలతో అభిమానులను అలరించింది. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తిక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ తమ ప్రదర్శనలతో ఫ్యాన్స్ను ఉర్రూతలూగించారు.
ప్రదర్శనలో భాగంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన పఠాన్ మూవీలోని సాంగ్స్కు డ్యాన్స్ వేశాడు. షారుఖ్ ఖాన్తో డబ్ల్యూపీఎల్ మహిళా కెప్టెన్లు కూడా అదిరే స్టెప్పులు వేయడ విశేషం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ డ్యాన్స్ ఆకట్టుకుంది. షారుఖ్ ఖాన్ ట్రేడ్మార్క్ ఫోజ్కు అతనితో కలిసి కెప్టన్లందరూ స్టిల్ ఇచ్చారు.
ఈ వేడుకకు నటి అర్చనా విజయ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. బీసీసీఐ సెక్రటరీ జై షా, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు హాజరయ్యారు. కాగా, గతేడాది మాదిరే మొత్తం ఐదు ఫ్రాంచైజీలు టైటిల్ కోసం ఈ సారీ పోటీపడుతున్నాయి. ముంబయి, ఢిల్లీతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ ఈ సీజన్ కోసం సిద్దమయ్యాయి.
అయితే గత సీజన్ ముంబయికి పరిమితమైన డబ్ల్యూపీఎల్.. ఈ సారి రెండు నగరాల్లో ఆతిథ్యం ఇవ్వనుంది. ముంబైలోని డీవై పాటిల్, బ్రబౌర్న్ మైదానాల్లో తొలి సీజన్ జరిగింది. కానీ, ఈ సారి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం ఆతిథ్యం ఇవ్వనున్నాయి. బెంగళూరు వేదికగా మొదటి 11 మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా 11 మ్యాచ్లను షెడ్యూల్ చేశారు. మార్చి 17న జరిగే ఫైనల్తో ఈ సీజన్కు తెరపడనుంది.