ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లకు అయిదు వికెట్లకు 181 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (58; 36 బంతుల్లో ), అలీస్ క్యాప్సీ (48; 32 బంతుల్లో) సత్తా చాటారు. శ్రేయంక పాటిల్ నాలుగు వికెట్లు తీసింది.
అనంతరం ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. రిచా ఘోష్ (51; 29 బంతుల్లో), ఎలీస్ పెర్రీ (49; 32 బంతుల్లో) పోరాడారు. అయితే ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఆర్సీబీ గెలుస్తుందని భావించారంతా. ఛేదన ఆరంభంలోనే కెప్టెన్ స్మృతి మంధాన (5; 7 బంతుల్లో) ఔటైనా సోఫి (33; 30 బంతుల్లో)తో కలిసి ఎలీస్ పెర్రీ ఇన్నింగ్స్ చక్కదిద్దింది. రెండో వికెట్కు వీరిద్దరు 80 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఢిల్లీ బౌలర్లు పుంజుకోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

ఆర్సీబీ విజయానికి చివరి మూడు ఓవర్లలో 40 పరుగులు అవసరమయ్యాయి. 18వ ఓవర్లో రిచా ఘోష్, జార్జియా (12; 6 బంతుల్లో) చెరో బౌండరీ సాధించడంతో 12 పరుగులు వచ్చాయి. అయితే 19వ ఓవర్లో జార్జియాను షికా పాండే ఔట్ చేయడంతో బెంగళూరు గెలుపు సమీకరణం 6 బంతుల్లో 17 పరుగులుగా మారింది. జొనాస్సెన్ వేసిన తొలి బంతిని రిచా ఘోష్ సిక్సర్గా మలిచింది. రెండో బంతికి పరుగేమి లభించలేదు. మూడో బంతికి దిశా రనౌటైంది.
నాలుగో బంతికి రెండు పరుగులు తీసిన రిచా అయిదో బంతికి సిక్సర్ బాదింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరమవ్వగా రిచా రనౌటైంది. అప్పటికే అలసిపోయిన రిచా పరుగు కోసం తీవ్రంగా ప్రయత్నించి డైవ్ చేస్తూ క్రీజులోకి దూసుకెళ్లినప్పటికీ నిరాశే మిగిలింది. ఓటమి అనంతరం మైదానంలోనే రిచా ఘోష్ కన్నీరు పెట్టుకుంది. అయితే రిచా పోరాటపటిమను అందరూ కొనియాడుతున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా రిచాకు ధైర్యాన్ని ఇచ్చాడు. రిచా ఘోష్ ఫొటోతో 'యూ ఆర్ ఏ స్టార్' అంటూ సూర్య స్టోరీ పెట్టాడు.