ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్గా నిలిచింది. ట్రోఫీని అందుకోవాలనే 17 ఏళ్ల ఆర్సీబీ ఫ్రాంచైజీ కలను అమ్మాయిలు నెరవేర్చారు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో ఒత్తిడిని జయించి విజేతగా నిలిచారు. ఆదివారం అరుణ్జైట్లీ స్టేడియంలో ఢిల్లీతో జరిగిన తుదిపోరులో ఆర్సీబీ ఉమెన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో ఛేదించింది. ఎలీస్ పెర్రీ (35*; 37 బంతుల్లో), సోఫీ డివైన్ (32; 27 బంతుల్లో), స్మృతి మంధాన (31; 39 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. రిచా ఘోష్ (17*; 14 బంతుల్లో) సత్తాచాటింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాంక పాటిల్ (4/12) ధాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (44; 27 బంతుల్లో) టాప్ స్కోరర్.

మ్యాచ్ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడింది. తమ ఆర్సీబీ ఫ్యాన్స్కు ఓ సందేశాన్ని ఇచ్చింది. అలాగే విజయానికి గల కారణాలను పంచుకుంది. ఇది సమష్టి గెలుపు అని పేర్కొంది. ''ఫీలింగ్ హైలో ఉంది. మాటల్లో దాన్ని చెప్పలేను. ఓ విషయం కచ్చితంగా చెప్పగలను. మా టీమ్ పట్ల గర్వపడుతున్నా. మా బెంగళూరు అదరగొట్టింది. మేం ఢిల్లీకి వచ్చినప్పుడు రెండు ఓటములు ఎదుర్కొన్నాం. ఆ తర్వాత సరైన సమయంలో ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాం''
''ఈ టోర్నమెంట్స్ సరైన సమయంలో అత్యున్నత దశకు వెళ్తుంటాయి. గతేడాది ఓటమి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలుసుకున్నాం. మేనేజ్మెంట్ మాకు మద్దతుగా ఉంది. 'ఇది మీ జట్టు.. మీ శైలిలో నిర్ణయాలు తీసుకోండి' అని చెప్పింది. ఈ విజయం ఆర్సీబీకి ఎంతో విలువైనది. ట్రోఫీని గెలిచింది నేను ఒక్కదాన్ని కాదు, ఇది జట్టు గెలుపు. అత్యుత్తమ టాప్-5 విజయాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది''
''ఎంతో విధేయతతో ఉండే ఆర్సీబీ ఫ్యాన్స్కు ఓ సందేశం. ఎప్పుడూ 'ఈ సాలా కప్ నమదే' (ఈ సారి కప్ మనదే) అని అంటుంటారు. ఇప్పటి నుంచి 'ఈ సాలా కప్ నమ్దూ' (ఈ సారి కప్ మనది) అనండి. కన్నడ నాకు అంతగా రాదు. కానీ ఫ్యాన్స్కు ఇది చెప్పడం ఎంతో ముఖ్యం'' అని స్మృతి మంధాన పేర్కొంది.