బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ముంబై చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (44; 38 బంతుల్లో) టాప్ స్కోరర్.
అనంతరం ముంబై ఇండియన్స్ 15.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆది నుంచే ముంబై బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు యస్తికా భాటియా (31; 15 బంతుల్లో), హేలీ మాథ్యూస్ (26; 21 బంతుల్లో) తొలి వికెట్కు 3.5 ఓవర్లలోనే 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు ఎడాపెడా బౌండరీలు బాదారు.

యస్తికా ఔటైన తర్వాత వన్డౌన్లో వచ్చిన నాట్ స్కీవర్ (27; 25 బంతుల్లో) కాస్త నిలకడగా పరుగులు సాధించింది. కానీ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అమెలియా కెర్ (40*; 24 బంతుల్లో) ఆకాశమే హద్దుగా చెలరేగింది. కెర్ ధాటికి పరుగులు పోటెత్తాయి. ఆర్సీబీ తమ ఇన్నింగ్స్లో 14 బౌండరీలు సాధిస్తే... ఛేదనలో ముంబై 22 బౌండరీలు బాదడం విశేషం.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. స్మృతి మంధాన (9; 11 బంతుల్లో), సబ్బినేని మేఘన (11; 12 బంతుల్లో), సోఫీ (9; 10 బంతుల్లో), రిచా ఘోష్ (7; 10 బంతుల్లో) నిరాశపరిచారు. జార్జియా (27; 20 బంతుల్లో) కలిసి ఎలిస్ పెర్రీ పోరాడటంతో బెంగళూరు 131 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో నాట్ స్కీవర్, పూజ చెరో రెండు వికెట్లు తీశారు.