తిరువనంతపురం: బౌలర్ శ్రీశాంత్కు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. అతనిపై బిసిసిఐ విధించిన జీవితకాల నిషేధాన్ని కొనసాగించాలని కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశించింది.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీకాంత్పై నిషేధాన్ని కొట్టివేస్తూ సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బిసిసిఐ వేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. కేరళ బౌలర్కు అనుకూలంగా ఉన్న సింగిల్ జడ్జ్ బెంచ్ తీర్పును కొట్టి వేసింది.

అయితే, దీనిపై శ్రీశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైకోర్టు తీర్పు అత్యంత చెత్తగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.
'ఇప్పటివరకూ వచ్చిన తీర్పుల్లో ఇది అత్యంత చెత్తగా ఉంది. నాకేమైనా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా? నిజమైన దోషులను శిక్షించరా? చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ జట్ల గురించి ఏమంటారు? లోధా రిపోర్టులో పేర్కొన్న 13 మంది పరిస్థితి ఏమిటి? దాని గురించి ఎవరూ పట్టించుకోరు' అని ఆగ్రహించారు.
తన పైన కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రం నమ్మకం కోల్పోలేదని చెప్పారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశాడు.