కోల్కతా: తాను చాలా బాధపడ్డానని భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ అన్నాడు. పాకిస్థాన్తో శనివారం జరిగన మ్యాచులో విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడాడు. అయితే, తన బాధ న్యూజిలాండ్ చేతిలో తొలి మ్యాచులోనే ఓటమి పాలవడంపై అని పేర్కొన్నాడు. ఆ ఓటమి తనను తీవ్రంగా బాధించిందని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా మార్చి 15న జరిగిన తొలి మ్యాచ్లో న్యూజీలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైనందుకు చాలా ఫీలయ్యానని చెప్పాడు. ఆ మ్యాచ్లో తాను 23 పరుగులు మాత్రమే చేసి ఔటయినందుకు చాలా బాధపడ్డానని కోహ్లీ వెల్లడించాడు.
అయితే 40-45 పరుగులు చేసినట్లయితే మ్యాచ్ భారత్ గెలుస్తుందని భావించానని తన చెప్పాడు. గత మ్యాచ్ ఓటమి వల్ల పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ లో చాలా ఓపికగా, చాలా కూల్గా ఇన్నింగ్స్ ఆడినట్లుగా కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడల్లా తన బ్యాట్ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ వస్తుందన్నాడు.

పాకిస్థాన్పై గెలవడం ఆనందాన్నిచ్చిందని తెలిపాడు. యువరాజ్ సింగ్ కూడా అద్భుతంగా ఆడి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించాడని తెలిపాడు. టీమిండియా ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతో విజయం సాకారమైందని తెలిపాడు.
పాకిస్తాన్ తో ఈడెన్ గార్డెన్ మైదానంలో అర్ధ సెంచరీ సాధించినప్పుడు భారత బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి ఎప్పటిలాగానే బ్యాట్ పైకెత్తి చూపించడంతో ఆగిపోలేదు. స్టేడియంలోని ప్రేక్షకుల వైపు చూస్తూ కిందికి వంగుతూ వందనం చేయడం అందరికీ కనిపించింది.
అది తాను ఎంతో అభిమానించే క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కోసమని కోహ్లీ చెప్పడం విశేషం.
కాగా, కోహ్లీ తన అర్ధ శతకాన్ని తనకు అంకితం చేయడం పట్ల మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపాడు. టీమిండియాకు ఇది గొప్ప విజయమని ప్రశంసించాడు. టీమిండియా విజయం అనంతరం డ్రెస్సింగ్ రూంకి వెళ్తున్న సమయంలో తనవైపు 'సచిన్.. సచిన్' అనే నినాదాలు వినపడ్డాయని, వాటితో తాను టీమిండియాలోనే ఉన్న భావన కలిగిందని సచిన్ చెప్పాడు.