మొహాలీ/సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ పేస్ దిగ్గజం మిచెట్ జాన్సన్ మాట మార్చేశాడు. ప్రపంచ టీ20 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీపై మిచెల్ ప్రశంసల వర్షం కురిపించాడు.
అంతకుముందు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ కోహ్లీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు మిచెల్ ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఆసీస్ బౌలర్ మిచెల్ జాన్సన్ ట్వీట్స్ కోహ్లీని టార్గెట్ చేసినట్లు కనిపించాయి. ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో టాప్ 5 బ్యాట్స్మెన్స్ అంటూ ధోనీ, ఏబీ డివిలియర్స్, స్మిత్, రూట్, విలియమ్సన్ పేర్లను ప్రకటిస్తూ జాన్సన్ ఓ ట్వీట్ పెట్టాడు.
విరాట్ కోహ్లీ పేరును ప్రస్తావించకపోవడంపై కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీసి క్వార్టర్ ఫైనల్ మ్యాచులో భారత్ను దెబ్బ తీయడానికి ఆస్ట్రేలియా జాన్సన్ను వాడుకున్నట్లు తెలుస్తోంది.

అద్భుతమైన ఫామ్లో ఉన్న కోహ్లీని జాన్సన్ ప్రస్తావించకపోవడం ఏమిటని భారత క్రికెట్ అభిమానులు ప్రశ్నించారు. ఈ ట్వీట్లపై మీడియా కోహ్లీని ప్రశ్నించగా.. ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఇదసలు పెద్ద విషయమే కాదని చెప్పాడు. ఆసీస్తో తాను ఆడిన ప్రతీ మ్యాచ్ నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉన్నానని తెలిపాడు.
జాన్సన్ కూడా కోహ్లీ పేరు చేర్చకపోవడంపై వివరణ ఇచ్చాడు. నిరుడు జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో కోహ్లీ ఫెయిలయ్యాడని, అందుకే చేర్చలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో అద్భుతమైన ఆటను ప్రదర్శించి ఇండియాను గెలిపించిన విషయం తెలిసిందే. దీంతో మిచెల్ జాన్సన్ నాలుక్కర్చుకున్నట్లయింది.
ఆస్ట్రేలియాపై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీపై తాజాగా మిచెల్ జాన్సన్ ప్రశంసలు కురిపించాడు. తీవ్రమైన ఒత్తిడిలో కూడా విరాట్ కోహ్లీ కూల్ గా ఇన్నింగ్స్ ఆడి అతని జట్టును గెలిపించాడని కొనియాడాడు. టీ20 ప్రపంచ కప్ సాధించే దిశగా ఇండియా సాగిపోతోందని చెప్పాడు. అంతేగాక, కోహ్లీ పేరును మర్చిపోయినందుకు తనపై అభిమానులు చాలానే ఆగ్రహంగా ఉన్నారని, ఇందుకు తన ట్విట్టర్లో ట్వీట్లు గమనిస్తే తెలుస్తుందని చెప్పాడు.