మొహాలీ: పాకిస్తాన్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో అఫ్రిది సేన బోర్లా పడింది. ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా మొహాలీలో జరిగిన మ్యాచ్లో పాక్ 21 పరుగుల చేతిలో ఆసిస్ చేతిలో ఓడింది. దీంతో, పాక్ ప్రపంచ కప్ నుంచి అవుట్ అయింది.
ఆదివారం పాక్ - భారత్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు రెండో స్థానం కోసం తలపడనున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు భారత్, ఆస్ట్రేలియాలు చెరీ నాలుగు పాయింట్లతో ఉన్నాయి. ఆదివారం మొహాలీలో జరిగే మ్యాచ్లో ఆసిస్ పైన భారత్ గెలవాల్సి ఉంది.

కాగా, పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. పాక్కు 194 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్కు ఖ్వాజా (21), ఫించ్ (15) మంచి ఆరంభం ఇచ్చారు.
కెప్టెన్ స్టీవ్ స్మిత్ (61) ఆచితూచి ఆడాడు. మ్యాక్స్వెల్ (30) జోరుగా ఆడే ప్రయత్నం చేశాడు. షేన్ వాట్సన్ (44) సత్తా చాటాడు. వాట్సన్ ధాటిగా ఆడడంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో వాహబ్ రియాజ్, ఇమాద్ వాసిం చెరో రెండు వికెట్లు తీసి రాణించారు.
ఆ తర్వాత 194 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఆసిస్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 192 పరుగులు చేసింది. పాక్ జట్టులో షర్జీద్ ఖాన్ (30), ఖలీద్ లతీఫ్ (46), ఉమర్ అక్మల్ (32), షోయబ్ మాలిక్ (40) పరుగులు చేశారు. హాజిల్ వుడ్ ఒక వికెట్, జంపా రెండు వికెట్లు తీశారు. ఫాల్కనర్ 5 వికెట్లు తీసి పాక్ను దెబ్బతీశాడు.