ధర్మశాల: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా ధర్మశాలలో భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ధర్మశాల స్టేడియం సిద్ధమవుతోంది. స్టేడియంలో 25 శాతం సీట్లను పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న సీట్లకు మరో అయిదువేల సీట్లను పెంచనున్నారు.
హెచ్పిసిఏ అధికార ప్రతినిధి సంజయ్ శర్మ మాట్లాడుతూ... ప్రస్తుతం ధర్మశాల స్టేడియంలో 20 వేలమంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉందని చెప్పారు. మరో అయివేదల మంది కూర్చునేందుకు సీటింగ్ కెపాసిటీ పెంచుతామని చెప్పారు.

ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్తో మరో 30 కొత్త గదులను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. పెవిలియన్ హోటల్ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. పెవిలియన్ హోటల్ను హెచ్పిసిఏ కట్టించింది. ఇందులో వంద గదులు ఉన్నాయి. హోటల్లో మరో 30 కొత్త గదులు, సీటింగ్ సామర్థ్యం పెంచే పనులు అప్పుడే ప్రారంభమయ్యాయని చెప్పారు.
ధర్మశాల వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం తాము హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సహకారం కూడా తీసుకుంటామని చెప్పారు. ఈ మ్యాచ్ను పరోక్షంగా.. టీవీలు తదితరాల ద్వారా చాలామంది క్రికెట్ ప్రేమికులు చూస్తారని చెప్పారు. పాకిస్తాన్ - భారత్ మ్యాచ్ మార్చి 19వ తేదీన జరగనుంది.