లాహోర్: టీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ అధ్వాన్న ప్రదర్శనకు దేశ ప్రజలు తనను క్షమించాలని ఆ దేశ జట్టు చీఫ్ కోచ్ వకార్ యూనిస్ కోరాడు. తాను తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు అతను చెప్పాడు.
'ప్రపంచకప్లో పాక్ ప్రదర్శనకు బాధ్యత వహిస్తున్నా. క్షమించాలని ప్రజలను చేతులెత్తి వేడుకుంటున్నా. నేనింకా కోచ్గా కొనసాగకూడదని మీరు భావిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా' అని వకార్ పేర్కొన్నాడు.
'జట్టులో రాజకీయాలు, గ్రూపులు లేవు. ఈ మెగా టోర్నీలో జట్టుది కేవలం పేలవ ప్రదర్శన మాత్రమే. ఇది ఏ ఒక్కరి తప్పుకాదు. జట్టులో అంతర్గత లోపాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది' అని వకార్ తెలిపాడు.
కాగా, టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పరాజయానికి బాధ్యత వహిస్తూ కోచ్ వకార్ యూనిస్ బహిరంగ క్షమాపణ చెప్పడంపై మాజీ కెప్టెన్లు భిన్నంగా స్పందించారు. క్షమాపణ చిన్న విషయమని, ఇప్పటికే ఆలస్యం చేశారని మాజీ కెప్టెన్లు రమీజ్ రాజా, మహ్మద్ యూసఫ్ వ్యాఖ్యానించారు.

మీడియా ముందు వకార్ క్షమాపణ చెప్పడం బాధ కలిగించిందని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. వకార్ గొప్ప బౌలర్ అని, అతడు క్షమాపణ చెప్పే పరిస్థితి రావడం బాధాకమని పేర్కొన్నాడు. జట్టు ఓటమికి ఒక్కరే బాధ్యులు కారని, పాక్ క్రికెట్ టీమ్లో చాలా అంశాలు మెరుగుపరచాల్సిన అవసరముందన్నాడు.
బోర్డు ఇచ్చిన స్వేచ్ఛను వకార్ ఉపయోగించుకోలేకపోయారని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రమీజ్ రాజా అన్నాడు. మూడేళ్ల నుంచి జట్టు ఆటతీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు. కోచ్ గా వకార్ విఫలమయ్యారని విమర్శించారు.
జట్టుకు నష్టం జరిగిన తర్వాత తీరిగ్గా వకార్ క్షమాపణ చెప్పారని మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ ధ్వజమెత్తారు. రాహుల్ ద్రావిడ్ను భారత జూనియర్ టీమ్కు కోచ్గా నియమించినట్టుగానే.. పాక్ జూనియర్ టీమ్కు వకార్ను కోచ్ నియమించాల్సిందని సూచించారు. పాకిస్థాన్ జట్టును సంస్కరించేందుకు విప్లవాత్మక, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు.
కాగా, టీ20 ప్రపంచకప్లో నాకౌట్ చేరడంలో విఫలమైన పాక్ జట్టు స్వదేశానికి చేరగానే అభిమానులు ''సిగ్గు.. సిగ్గు'' అంటూ నినాదాలతో స్వాగతం పలుకుతూ నిరసన వ్యక్తం చేశారు.