న్యూఢిల్లీ: వచ్చే ఏడాది 2016లో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. భారత్లోని పలు స్డేడియాల్లో వరల్డ్ టీ20ని నిర్వహించేందుకు పూర్తి షెడ్యూల్ను కూడా బీసీసీఐ విడుదల చేసింది.
అయితే ఈ షెడ్యూల్లో పాకిస్ధాన్ జట్టు ఆడే మ్యాచ్లు మహారాష్ట్రలో లేకుండా జాగ్రత్తపడింది. మహారాష్ట్రలోని ముంబై, నాగ్పూర్లలో ఉన్న స్డేడియాలు ఐసీసీ వరల్డ్ టీ20కి ఆతిథ్యమిస్తున్నాయి. మహారాష్ట్రలోని వాంఖడే, వీసీఏ మైదానాల్లో పాక్ మ్యాచ్లు నిర్వహిస్తే శివసేన, ఎంఎన్ఎస్ వంటి రాజకీయ పార్టీల నుంచి తీవ్ర నిరసనలు, ఆందోళనలు తప్పవన్న విషయాన్ని ముందుగానే గుర్తించిన బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
పాకిస్ధాన్ మ్యాచ్లను మహారాష్ట్ర వెలుపలే నిర్వహించాలని నిర్ణయించిన బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడారని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా బోర్డు నిర్ణయం సరైందేనని సలహా ఇచ్చిందని తెలిపారు.

వచ్చే ఏడాది జరగనున్న ఈ టోర్నమెంట్ జరిగే సమయానికి భారత్, పాకిస్దాన్ల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదని, అలాంటప్పుడు రిస్క్ తీసుకోలేమని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. జులై 27న పాకిస్ధాన్కు చెందిన కొందరు ఉగ్రవాదులు పంజాబ్ రాష్ట్రంలోకి గురుదాస్పూర్లో పోలీస్స్టేషన్పై దాడికి పాల్పడి 13 మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే.
ఐసీసీ వరల్డ్ టీ20 ఫైనల్ మ్యాచ్ని కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో ప్రొ కబడ్డీ, హాకీ లీగ్లో పాకిస్ధాన్ ఆటగాళ్లను శివసేన వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.