న్యూఢిల్లీ: ఐసిసి టీ20 ప్రపంచకప్లో భాగంగా మార్చి 19న హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియంలో జరగనున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్కు భద్రత కల్పించలేమని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
తాజాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్.. కేంద్ర హోంమంత్రికి ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలియజేశారు. అయితే దీనిపై బీసీసీఐ కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు.
ఏడాది క్రితమే టీ20 ప్రపంచకప్ జరిగే వేదికలపై బీసీసీఐ నిర్ణయం తీసుకుందని, మ్యాచ్ల షెడ్యూల్ కూడా ఆరు నెలల ముందే వెల్లడించామని ఠాకూర్ తెలిపారు. టోర్నీలో అత్యంత ఆసక్తికరమైన ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే విక్రయించామని ఈ తరుణంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయడం తగదన్నారు.

కొద్ది రోజుల క్రితం అస్సాంలో జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్లో పాల్గొనేందుకు వచ్చిన వందలాది మంది పాకిస్థాన్ క్రీడాకారులకు కల్పించడం జరిగిందని.. ఇక్కడ మాత్రం పదుల సంఖ్యలో క్రీడాకారులకు రక్షణ కల్పించలేరా? అని హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పాకిస్థాన్ ఆరోపణలకు బలం చేకూరేలా వ్యవహరించడం తగదని, ఇది భారతదేశ ప్రతిష్టకు సంబంధించిన విషయమని అన్నారు. ఈ సందర్భంలో రాజకీయాలు చేయడం తగదని అన్నారు. కాగా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్ ఇప్పటికే పాక్ క్రికెట్ జట్టు భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భారత్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.