న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా ఆదివారం నాడు మొహాలిలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో ధోని సేన 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన సందర్భంగా టీమిండియాకు ట్విట్టర్లో యావత్ భారతావని ప్రశంసలు కురిపిస్తోంది.
ఈ మ్యాచ్లో 51 బంతుల్లో 82 పరుగులు సాధించి టీమిండియా సెమీస్కు చేరడంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మాజీ ఇంగ్లాండ్ ఆల్ రౌండర ఆండ్రూ ఫ్లింటాప్ మధ్య ట్విట్టర్లో మాటలు వేడెక్కాయి.

ఈ సందర్భంగా ఆండ్రూ ఫ్లింటాప్ ట్విట్టర్లో విరాట్ ఇలాంటి ఆటతీరునే కొనసాగిస్తే ఏదో ఒక రోజు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మన్ రూట్ అంతటివాడవుతాడని, వరల్డ్ కప్ ఫైనల్లో ఏయే జట్లు తలపడతాయో తనకు తెలియదని అన్నాడు. ఈ ట్వీట్కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రూట్ ఎవరు? అంటూ ఎగతాళిగా అన్నాడు.
దీనికి ప్రతి సమాధానంగా ఆండ్రూ ప్లింటాప్ విరాట్ కోహ్లీ క్లాస్ నుంచే వచ్చాడని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత స్వారీ మీరెవరు? అంటూ నాలుక్కరుచుకున్న ఇమేజితో ట్విట్టర్లో అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ హ్యాండ్లర్ను పోస్టు చేశాడు. ఈ ట్వీట్లపై ట్విట్టర్లో అటు అమితాబ్కు మద్దతుగా పలువురు నెటిజన్లు అమితాబ్ కావాలనే అలా అడిగారని మద్దుత తెలపగా, మరి కొందరు మాత్రం రూట్ ఎవరో తెలియదంటారా? అంటూ మండిపడ్డారు.
అంతక ముందు ట్విట్టర్లో కోహ్లీ నిజంగా ఓ జీనియస్ అని అమితాబ్ తమకు ఇలాంటి ఆనందకరమైన రాత్రులను మరిన్ని ఇవ్వాలని కోరారు. విరాట్ నీవు చాలా జీనియస్.. సమయానికి తగినట్లు వ్యవహరించడంలో నిజంగా నీవి అద్భుతమైన తెలివితేటలు. ఈ రాత్రిని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి రాత్రులు మనకు ఎన్నో రావాలని కోరుకుంటున్నాను' అని అమితాబ్ ట్వీట్ చేశారు.