నాగపూర్: ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో పసికూన అఫ్గనిస్తాన్ చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ జట్టును ఆరు పరుగుల తేడాతో ఓడించి షాక్ ఇచ్చింది. అఫ్గనిస్తాన్ తన ముందుంచిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక వెస్టిండీస్ తోక ముడిచింది.
ఫోటో గ్యాలేరి: వరల్డ్T20
ఈ ఓటమి వల్ల వెస్టిండీస్కు నష్టం జరగలేదు గానీ పసికూనల చేతిలో ఓడిపోయిన అపఖ్యాతిని మాత్రం మూటగట్టుకుంది. వెస్టిండీస్ ఇప్పటికే సెమీ ఫైనల్కు చేరుకుంది. వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేయగలిగింది.

ఈ టోర్నమెంటులో ఇప్పటి వరకు అఫ్గాన్ చేసిన అద్భుతమైన ప్రదర్శన ఇదే. క్రిస్ గేల్ లేనప్పటికీ వెస్టిండీస్ బలంగానే కనిపించింది. గేల్కు విశ్రాంతి ఇచ్చారు. విజయం సాధించిన అఫ్గాన్ ఆటగాళ్లలో ఆనందానికి అంతు లేకుండా పోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. నజిబుల్లా జద్రాన్ నాలుగు బౌండరీలు, ఓ సిక్స్తో 40 బంతుల్లో 48 పరుగులు చేశాడు. దాంతో అఫ్గనిస్తాన్ వెస్టిండీస్కు పోటీ ఇవ్వగలిగింది. 56 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో జద్రాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
చివరి ఓవరు ఆఫ్ స్పిన్నర్ మొహమ్మద్ నబీకి ఇచ్చి అఫ్గాన్ కెప్టెన్ ఆస్గర్ స్టాతిక్జాయ్ సమయస్ఫూర్తిని కనబరిచాడు. చివరి ఓవరులో వెస్టిండీస్ 10 పరుగులు చేయాల్సి ఉండగా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.