అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదైంది. నమీబియా బ్యాటర్ జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ 33 బంతుల్లోనే సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. ఇంటర్నేషనల్ మెన్స్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. ట్రైనేషన్ టీ20 సిరీస్లో నేపాల్తో జరిగిన మ్యాచ్లో జాన్ నికోల్ లాఫ్టీ విధ్యంసం సృష్టించాడు. బౌండరీలు, సిక్సర్ల మోత మోగించాడు. ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ 11వ ఓవర్లో క్రీజులోకి వచ్చాడు. జట్టు స్కోరు 62/3 ఉన్నప్పుడు బాదే బాధ్యతలు అందుకన్నాడు. 11 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాదాడు.
జాన్ నికోల్ ఊచకోతతో ప్రపంచ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డులు బదలయ్యాయి. గతంలో అత్యంత వేగంవంతమైన సెంచరీ రికార్డు నేపాల్ బ్యాటర్ కుశాల్ పేరిట ఉండేది. గతేడాది ఏషియన్ గేమ్స్లో మంగోలియాపై కుశాల్ ఈ రికార్డు నెలకొల్పాడు. అంతకంటేముందు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, న్యూజిలాండ్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరు 35 బంతుల్లో మూడంకెల స్కోరును అందుకున్నారు.

అంతర్జాతీయ క్రికెట్లో జాన్ నికోల్ లాఫ్టీకి తొలి 50+ స్కోరు ఇదే కావడం విశేషం. లీగ్ క్రికెట్లతో కలిపి అతడికి ఇది రెండో స్కోరు. కాగా, 62/3 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన నికోల్ అతడి దూకుడుతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 206 పరుగులు చేసింది. నికోల్ నాలుగో వికెట్కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆఖరి ఓవర్లో షాట్కు యత్నించి 36 బంతుల్లో 101 పరుగులు వద్ద వెనుదిరిగాడు.
అనంతరం నికోల్ లాఫ్టీ బంతితోనూ మెరిశాడు. మూడు ఓవర్లలో 29 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో నేపాల్ 18.5 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. ఆల్రౌండ్ షోతో విజయంలో కీలక పాత్ర పోషించిన నికోల్ లాఫ్టీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ట్రై నేషన్ టీ20 సిరీస్లో నేపాల్, నమీబియాతో పాటు నెదర్లాండ్స్ తలపడుతోంది.