పెర్త్: టీమిండియా వైస్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయాడు. శిక్షణా శిబిరంలో ఓ జర్నలిస్టును దూషించాడు. ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా భారత్ వెస్టిండీస్తో తలపడనున్న నేపథ్యంలో భారత క్రికెటర్లు మంగళవారంనాడు శిక్షణా శిబిరంలో పాల్గొన్నారు.
కోహ్లీ శిక్షణ ముగించుకుని డ్రెసింగ్ రూంకు వెళ్తున్నాడు. ఈ సమయంలో ఓ భారత జర్నలిస్టు అతనికి ఎదురు పడ్డాడు. అకస్మాత్తుగా కోహ్లీ ఆ జర్నలిస్టుపై తిట్ల దండకం ఎత్తుకున్నాడు. బూతులు తిట్టాడు. కొద్ది సేపటి దాకా అది సాగింది. ఆ సంఘటనను చూసి ఏమైందో అర్థం కాక ఇతర జట్టు సభ్యులు విస్తుపోయారు.
ఆ జర్నలిస్టుకు కూడా ఏమైందో, ఎందుకు కోహ్లీ అలా తిట్టాడో అర్థం కాక ఆశ్చర్యపోయాడు. అయితే, తన ప్రేయసి అనుష్క శర్మ గురించి, తన గురించి ఆ జర్నలిస్టే ఓ జాతీయ పత్రికలో వార్తాకథనం రాశాడనే కోపంతో విరాట్ కోహ్లీ విరుచుకుపడినట్లు చెబుతున్నారు.

అయితే, ఆ తర్వాత విరాట్ కోహ్లీ దానికి వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. ఆ వార్తాకథనం రాసిన జర్నలిస్టు ఇతనే అని చెప్పి తాను తప్పుగా అర్థం చేసుకున్నానని, ఒకరిని చూసి మరొకరు అని అనుకున్నానని విరాట్ కోహ్లీ చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత కోహ్లీ ఓ జర్నలిస్టును పిలిచి క్షమాపణ చెప్పినట్లు సమాచారం.
రవిశాస్త్రి వ్యక్తిగతంగా విరాట్ కోహ్లీతో మాట్లాడి, అతన్ని చల్లబరిచినట్లు చెబుతున్నారు. భవిష్యత్తు కెప్టెన్ ఇలా మాట్లాడడం సరి కాదని, బహిరంగంగా ఇటువంటి చర్యలకు పాల్పడడం మంచిది కాదని చెప్పినట్లు సమాచారం .