హైదరాబాద్: ఇంగ్లండ్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ కప్ సెమీ పైనల్లో 171 పరుగులతో నాటౌట్గా నిలిచి భారత్ను పైనల్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్ ప్రీత్ కౌర్కి ప్రమోషన్ లభించింది. 2014 మే నుంచి ఆమె పశ్చిమ రైల్వే జోన్లో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
మహిళాల వరల్డ్ కప్లో హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శనకు గాను ఆమెను రైల్వే క్రీడల విభాగంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పదోన్నతి కల్పిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్మన్కు పదోన్నతి కల్పించినట్లు పశ్చిమ రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు.

సెప్టెంబర్ 7వ తేదీన హర్మన్కు ప్రమోషన్ లభించిందని, అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన చేసిన రైల్వే క్రీడాకారులకు ప్రమోషన్లు ఇస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే హర్మన్కు ప్రమోషన్ లభించిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ ఏకే గుప్త, హర్మన్కు అభినందనలు తెలియజేశారు.
ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్కు చేరిన భారత మహిళా జట్టులోని రైల్వే క్రికెటర్లకు అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రమోషన్తో పాటు నగదు ప్రోత్సాహకాలిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పినట్లే రైల్వే శాఖలోని 10 మంది క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ.13 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని జులై 27న ప్రకటించారు.
మిథాలీ నేతృత్వంలోని భారత మహిళల జట్టులోని 15 మంది సభ్యుల్లో 10 మంది రైల్వే ఉద్యోగులు ఉన్నారు. కెప్టెన్ మిథాలీతో సహా వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఎక్తా బిష్త్, పూనమ్ రౌత్, వేధ కృష్ణమూర్తి, పూనమ్ యాదవ్, సుష్మా వర్మ, మోనా మెశ్రామ్, రాజేశ్వరి గైక్వాడ్, నుజాత్ పర్విన్లు రైల్వే ఉద్యోగులుగా ఉన్నారు.