
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టోర్నీలో భాగంగా మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్కి ముందు మీడియాతో మాట్లాడిన కేన్ విలియమ్సన్ "ఈ ప్రపంచకప్లో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ని కొనసాగిస్తున్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు" అని ప్రశంసించాడు. కాగా, ఇప్పటివరకు రోహిత్ శర్మ ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో 647 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.
2008లో అండర్-19 ప్రపంచకప్ సెమీస్ ఫైనల్లో కోహ్లీసేనతో తలపడిన సందర్భాన్నీ విలియమ్సన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన వికెట్ తీయడంపై విలియమ్సన్ స్పందించాడు. "కోహ్లీ అప్పుడు ఆల్రౌండర్గా ఉండేవాడు, ఇప్పుడు అలా బౌలింగ్ చేయడంలేదు" అని చెప్పడంతో నవ్వులు పూశాయి.
ఇక, యువ క్రికెటర్ల నుంచి ఇలా జాతీయ జట్టుకు నాయకత్వం వహించే వరకూ ఎదగడం చాలా గొప్పగా ఉందని కేన్ విలియమ్సన్ చెప్పాడు. టీమిండియాతో జరగబోయే మ్యాచ్లో మంచి ప్రదర్శన చేయాలని అనుకుంటున్నామని కేన్ విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.
ఇప్పటివరకూ ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ బౌలర్ల ప్రదర్శన బాగుందని, తమ బౌలర్లు పరిస్థితులను త్వరగా అర్థం చేసుకొని రాణిస్తున్నారని విలియమ్సన్ చెప్పాడు. అలాగే టీమిండియా బౌలింగ్ సామర్థ్యం కూడా అద్భుతంగా ఉందని, టీమిండియా సమతూకంతో అద్భుత ప్రదర్శన చేస్తోందని విలియమ్సన్ అన్నాడు.
కాగా, ప్రపంచకప్లో తొలి సెమీస్కు సర్వం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్తో తొలి సెమీస్లో తలపడుతుంది. మంగళవారం జరగనున్న ఈ మ్యాచ్కి ఓల్ట్ ట్రాఫోర్డ్ ఆతిథ్యమిస్తోంది. ఒక్క ఇంగ్లాండ్ తప్పించి లీగ్ స్టేజిలో ఆడిన ప్రతి జట్టుపై కోహ్లీసేన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 31 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. ఇక, న్యూజిలాండ్తో జరగాల్సిన మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దు అయింది. టోర్నీలో భాగంగా లీగ్ స్టేజిలో ఏ న్యూజిలాండ్తో అయితే మ్యాచ్ ఆడలేదో అదే జట్టుతో ఇప్పుడు కోహ్లీసేన తొలి సెమీఫైనల్లో తలపడుతుండటం విశేషం.
లీగ్ స్టేజిలో న్యూజిలాండ్ ఆడిన గత మూడు మ్యాచ్ల్లోనూ ఓడింది. మరోవైపు కోహ్లీసేన వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి లీగ్ స్టేజిని ఘనంగా ముగించింది.