
కొంప కొల్లేరే..!
అదలావుంచితే- తాజాగా మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ సందర్భంగా వర్షం పడకూడదని కోరుకుంటున్న వారి జాబితాలో బహుశా అందరి కంటే ముందుండే పేరు స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యానిదే కావచ్చు. ఎందుకంటే- ఈ మ్యాచ్ గనక వర్షం వల్ల రద్దయితే స్టార్ స్పోర్ట్స్ కొంప కొల్లేరవుతుంది. ఇక- నెత్తిన తడిగుడ్డేసుకుని కూర్చోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొనడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు.

130 కోట్లకు పైగా నష్టం..
ఈ మ్యాచ్ రద్దయితే ఎంత హీనాతిహీనం అనుకున్నా కూడా 130 కోట్ల నష్టాన్ని స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం చవి చూడటం ఖాయం. వర్షం వల్ల ఇప్పటికే రద్దయిన నాలుగు మ్యాచ్ల వల్ల స్టార్స్పోర్ట్స్ చానల్ యాజమాన్యం సుమారు 180 కోట్ల రూపాయల మేర నష్టాన్ని చవి చూసింది. ఇప్పుడూ అదే జరిగితే నిండా మునుగుతుంది. రద్దయిన మ్యాచ్ల వల్ల ఎదుర్కొన్న నష్టం ఒక ఎత్తయితే.. భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే ఎదురయ్యే నష్టం మరో ఎత్తు. భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దయితే సంభవించే నష్టం.. మిగిలిన ఆ నాలుగు మ్యాచ్ల వల్ల ఎదురైన నష్టానికి దాదాపు సమానం కావడమే దీనికి ప్రధాన కారణం.

రేటెక్కువైనా ఫర్లేదు.. తక్కువ కాకూడదంతే
ప్రపంచకప్ ప్రధాన స్పాన్సర్లు ప్రముఖ టైర్ల ఉత్పాదక కంపెనీ ఎంఆర్ఎఫ్, శీతల పానీయాల ఉత్పత్తి సంస్థ కోకా కోలా, మొబైల్ తయారీ సంస్థ వన్ ప్లస్, ఆన్లైన్ కార్ల బుకింగ్ కంపెనీ ఉబేర్.. వంటి పలు బహుళజాతి సంస్థలు స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం నుంచి స్లాట్లను కొనుగోలు చేశాయి. వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే.. వాటికీ నష్టమే మిగులుతుంది. కోట్లాదిమంది అభిమానులు టీవీలకు అతుక్కుని, కళ్లప్పగించి చూసే మ్యాచ్ ఇది. అందుకే- మధ్యమధ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనల ద్వారా తమ ఉత్పత్తులను సాధారణ ప్రజానీకానికి చేరవేయడానికి భారీ ఖర్చుకు సైతం వెనుకాడాలేదు ఆయా బహుళజాతి సంస్థలు.

ఒక్కో సెకెనుకు ఎంతో తెలుసా?
మ్యాచ్ సందర్భంగా మధ్య మధ్యలో ప్రసారం అయ్యే వాణిజ్య ప్రకటనల కోసం ఆయా కంపెనీలు ఎంత ధర పెట్టి శ్లాట్లను కొనుగోలు చేశాయో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. కన్ను మూసి తెరిచే లోపలే అయిపోయే ఒక్క సెకెను కోసం ఆయా సంస్థలన్నీ రెండున్నర లక్షల రూపాయలను వ్యయం చేశాయి. ఇతర మ్యాచ్లతో పోల్చుకుంటే ఈ ధర రెట్టింపు అన్నమాట. ప్రపంచకప్ మ్యాచ్ల్లో స్టార్ స్పోర్ట్స్ చానల్ ఒక్క సెకన్ వాణిజ్య ప్రకటనలను ప్రసారం చేయడానికి లక్షా 60 వేల రూపాయల నుంచి లక్షా 80 వేల రూపాయల వరకు వసూలు చేస్తోంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు మాత్రం ఆ ధర మాత్రం రెండున్నర లక్షల రూపాయల పైనే ఉంటోంది.


Click it and Unblock the Notifications












