ముంబై: ఈ నెల 22వ తేదీన దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ భారత జట్టుకు పలు సూచనలు చేశాడు. సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ను ఎదుర్కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. స్టెయిన్ను ఇలా ఎదుర్కోవాలని ముందే ప్లాన్ చేసుకోలేమని, అతని అమ్ములపొదిలో ఎన్నోరకాల అస్త్రాలు ఉంటాయన్నాడు.
స్టెయిన్ అంతటివాడికి చెడ్డ రోజంటూ ఉంటుందని, ఆయన బౌలింగ్ను ఆచితూచి ఆడటం ఉత్తమమని చెప్పాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో అనుసరించిన బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయవలసిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ బాగా ఆడుతున్నాడని, బౌలర్లు సరైన సమయంలో రాణించారన్నాడు.

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో భారత్ కూడా టైటిల్ రేసులో ఉందన్నాడు. భారత్ టైటిల్ గెలుచుకునేందుకు స్టెప్ బై స్టెప్ ఆలోచించాలన్నాడు. మొత్తంగా క్వార్టర్ ఫైనల్ గురించో, మరోదాని గురించో ఆలోచించవద్దని సూచించాడు. ఏ మ్యాచ్ ఆడుతున్నామో దాని గురించి మాత్రమే ఆలోచించాలని సూచించాడు.
రోహిత్ శర్మ బాగా ఆడుతాడని ఆకాంక్షించాడు. రోహిత్ శర్మ పైన ఒత్తిడి పెట్టవద్దన్నాడు. అతని పైన అనుమానాలు లేవనెత్తి నిరాశకు గురి చేయవద్దని సూచించాడు. రోహిత్ కూడా వర్రీగా కావొద్దని హితవు పలికాడు. దక్షిణాఫ్రికా పైన ఓపెనింగ్ చాలా ముఖ్యమని చెప్పాడు. ధోనీ ఫామ్ ఆందోళన ఏమీ కలిగించడం లేదన్నాడు.